వంశీ లేఖను చంద్రబాబు పరిగణలోకి తీసుకుంటారా?
అనంతపురం నుండి గురువారం బాబు ఉదయం వచ్చారు. బాబును కలిసేందుకు వంశీ తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే పార్టీ నేతలు మాత్రం ససేమీరా అన్నారు. నేరుగా బాబునే కలిసి వివరణ ఇచ్చుకుంటానని ఆయన చెప్పినప్పటికీ పార్టీ నేతలు మాత్రం అది కుదరదని, పార్టీ జిల్లా నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి షోకాజ్ నోటీసులు జారీ చేసినందున మొదట ఆయనకే వివరణ ఇవ్వాలని సూచించారు.
అయితే వంశీ మాత్రం బాబుకే వివరణ ఇచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఆయన అపాయింటుమెంట్ కోసం ప్రయత్నాలు చేశారట. అయినా కుదరకపోవడంతో వంశీ చివరకు వివరణ లేఖను బాబుకు పంపించారు. అందులో.. తాను జగన్ను యాధృచ్చికంగానే కలిశానని, వివాదాస్పదం వద్దని, పార్టీలో క్రమశిక్షణతో ఉన్నానని, పరిటాల రవి అనుచరుడినని అందులో పేర్కొన్నారు.
అయితే షోకాజ్ నోటీసులు జారీ చేసిన చోటు కాకుండా హైదరాబాదులో వివరణ ఇస్తే బాబు అంగీకరించే అవకాశం లేదని అంటున్నారు. గోరంట్లకు వివరణ ఇవ్వాల్సిందేనని నేతలు చెబుతున్నారట. అయితే వంశీ మాత్రం తన లేఖను బాబు అంగీకరిస్తారనే విశ్వాసంతో ఉన్నారని తెలుస్తోంది.