తెలంగాణకోసం: లోకసభలో ఒక్కటైన టిటిడిపి, టిఆర్ఎస్!

ఒకే గొంతుగా తెలంగాణ కోసం నినాదాలు చేశారు. ఒకానొక దశలో నామా నాగేశ్వరరావు, విజయశాంతిలు స్పీకర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఉదయం పదకొండు గంటలకు ఒకసారి సభ వాయిదా పడింది. తిరిగి 12 గంటలకు సభ ప్రారంభమైన తర్వాత కొద్దిసేపు ఆందోళన చేసిన ఇరు పార్టీల ఎంపీలు, అప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రాకపోవటంతో మూకుమ్మడిగా వాకౌట్ చేశారు.
తొలుత సభ ప్రారంభమైన వెంటనే కెసిఆర్, విజయశాంతి, రమేశ్ రాథోడ్లు వెల్లోకి ప్రవేశించి, ప్లకార్డులు పట్టుకుని, జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. నామా నాగేశ్వర రావు అయితే ముందు వరుసలోని సీట్ల వరకూ వెళ్లి ప్లకార్డు పట్టుకుని నిరసన తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎంత సేపటికీ ఎలాంటి స్పందనా లేకపోవటంతో స్పీకర్ను విజయశాంతి నిలదీశారు. తెలంగాణలో ఎంతోమంది యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అవి ఆపేందుకు ప్రభుత్వంతో ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు.
స్పీకర్ నుంచి స్పందన లేకపోవటంతో మన్మోహన్, ప్రణబ్ వైపు తిరిగిన విజయశాంతి.. ప్రధాని గారూ మీరైనా పట్టించుకోండని, తెలంగాణ ఏర్పాటు చేయండని నినాదాలు చేశారు. అయితే, ప్రధాని కానీ, ప్రణబ్ కానీ విజయశాంతిని పట్టించుకోకుండా, తమ చర్చల్లోనే మునిగిపోయారు. తెలంగాణ ఎంపీలంతా సోనియాను నిలదీసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో స్పీకర్ సభను వాయిదా వేశారు.
తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు సభను పిసి చాకో ప్రారంభించారు. మళ్లీ టిడిపి, టిఆర్ఎస్ సభ్యులు వెల్లోకి దూసుకొచ్చి, నినాదాలు ప్రారంభించారు. అయితే, సభ్యులంతా తమతమ స్థానాల్లోకి వెళితే, మాట్లాడేందుకు అవ కాశం ఇస్తానని పిసి చాకో సూచించారు. కానీ, నామా నాగేశ్వర రావు వెల్లోకి దూసుకు వచ్చారు. ఆవేశంగా నినాదాలు చేశారు. కెసిఆర్, విజయశాంతి, రాథోడ్లు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా నినాదాలు చేశారు.
ఈ సమయంలో వీరికి ఎదురుగానే సోనియా గాంధీ కూర్చున్నారు. ఒక పక్క విజయశాంతి, రాథోడ్లు నినాదాలు చేస్తుండగా, మరో పక్క కెసిఆర్, నామా నాగేశ్వర రావు మాట్లాడుకున్నారు. ఈ సమయంలో టిడిపి ఎంపి నామాతో కెసిఆర్.. ఇంకా ఎంత సేపు నిల్చుంటాం.. పద వాకౌట్ చేద్దాం అని చెప్పారు. కెసిఆర్ ప్రతిపాదనకు నామా అంగీకరించారు. దీంతో టిడిపి, టిఆర్ఎస్ ఎంపీలు కలిసి సభ నుండి వాకౌట్ చేశారు.












Click it and Unblock the Notifications