బాబుకు వంశీ వివరణ: అంతకుముందు పడిగాపులు
కాగా అంతకుముందు చంద్రబాబును కలిసేందుకు వల్లభనేని వంశీ హైదరాబాద్ వచ్చారు. అనంతపురం పర్యటన పూర్తి చేసుకొని చంద్రబాబు గురువారం ఉదయం హైదరాబాద్ వచ్చారు. బాబును కలిసేందుకు వంశీ తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఎలాగైనా బాబునే స్వయంగా కలిసి వివరణ ఇచ్చేందుకు ఆయన యత్నించారు. కానీ పార్టీ నేతలు మాత్రం బాబును కలిసేందుకు ఆయనకు నో చెప్పారు.
జిల్లా పార్టీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి షోకాజ్ నోటీసులు ఇచ్చారని, కాబట్టి అక్కడే సమాధానం చెప్పాలని వంశీకి పార్టీ నేతలు సూచించారు. అక్కడ సమాధానం చెప్పాకే ఇక్కడకు రావాలన్నారు. అయినా వంశీ పట్టు వీడకుండా చంద్రబాబు కోసం కాచుకు కూర్చున్నారు. ఆ తర్వాత పార్టీ నేతలు అంగీకరించడంతో వంశీ నేరుగా హైదరాబాదులోనే జగన్తో కలవడంపై వివరణ ఇచ్చారు.
వంశీ తాను ఇచ్చిన వివరణ లేఖలో... తాను వైయస్ జగన్ను యాదృచ్ఛికంగానే కలిశానని పేర్కొన్నారు. జగన్ను కలవడంపై ఎలాంటి అపోహలు వద్దని, పార్టీ నిబంధనలు ఎప్పుడు తాను అతిక్రమించలేదని, తాను మాజీ మంత్రి పరిటాల రవీంద్ర అనుచరుడినని వంశీ లేఖలో పేర్కొన్నారు.
కాగా ఇటీవల వంశీ.. వైయస్ జగన్ను కలవడం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా ఆయన వివరణ ఇవ్వకుండా తన కలయికను సమర్థించుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పార్టీ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. బుధవారం ఎమ్మెల్యే కొడాలి నాని కూడా తెలుగుదేశం పార్టీ పోర్టు కోసం ధర్నా చేపడుతున్న సమయంలో మంత్రిని కలవడం చర్చనీయాంశమైంది.