బాబుపై అసంతృప్తి, లగడపాటితో ఉమ్మారెడ్డి మంతనాలు

ఉదయం లగడపాటి రాజగోపాల్ హైదరాబాదులోని ఉమ్మారెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో మంతనాలు జరిపారు. గుంటూరు జిల్లాలో కాపులను తమ దరి చేర్చుకునే ఉద్దేశ్యంలో భాగంగానే లగడపాటి ఆయనను కలిసి ఉంటారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఉమ్మారెడ్డికి గుంటూరు జిల్లాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అంతేకాకుండా జిల్లాలో కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రధాన నేత. దీంతో ఆయనను తమ దరి చేర్చుకునేందుకు కాంగ్రెసు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
ఉమ్మారెడ్డి అసంతృప్తి వ్యవహారం బహిర్గతం కాగానే ఆయన ఏ క్షణంలోనైనా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరిగింది. దీంతో ఆదిలోనే అతను అటు వైపుకు వెళ్లకుండా పార్టీ లగడపాటిని రంగంలోకి దించి ఉంటుందని అంటున్నారు. కాగా ఇటీవల తనకు రాజ్యసభను ఇవ్వక పోవడంతో ఉమ్మారెడ్డి బాబుపై అసంతృప్తితో ఉన్నారు. నాలుగు రోజుల క్రితం ఆయన పార్టీని తీవ్రంగా విమర్శించారు.
పార్టీలో కాపులకు ప్రాధాన్యత లేకుండా పోయిందని, 1983లో పార్టీ స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు కాపులకు ప్రాధాన్యత తగ్గుతూ వచ్చిందని ఆయన విమర్శలు చేశారు. ఉప ఎన్నికలకు ముందు ఉమ్మారెడ్డి వ్యాఖ్యలు టిడిపిలో కలకలం సృష్టించాయి. వెంటనే పార్టీ నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆదివారం, గుంటూరు జిల్లా కాపు నేతలు బాబును కలిశారు. బాబుతో భేటీ అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు.
పార్టీలో కాపులకు ప్రాధాన్యత లేదనటంలో వాస్తవం లేదన్నారు. అయితే 2014 ఎన్నికలలో మరింత ప్రాధాన్యత ఇవ్వాలని తాము బాబును అడిగామని, గుంటూరులో రెండు ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. అందుకు బాబు సానుకూలంగా స్పందించారన్నారు. ఉమ్మారెడ్డి పార్టీని వీడరని, ఆయన అంశం తమ మధ్య చర్చకు రాలేదని చెప్పారు.












Click it and Unblock the Notifications