ఉప ఎన్నికలలో ప్రచారానికి మంత్రుల నిరాసక్తత
స్థానికంగా ఏమాత్రం పరిచయాలు లేకుండా అక్కడ ఏం పని చేస్తామని కొందరు మంత్రులు నియోజకవర్గ బాధ్యతలపై ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు. చిరంజీవి రాజీనామాతో ఖాళీ అయిన తిరుపతి నియోజకవర్గానికి మంత్రి శ్రీధర్ బాబును ఇంచార్జిగా వేశారు. అయితే ఆయన మాత్రం తాను అన్ని నియోజకవర్గాలలో పర్యటిస్తానని చెప్పేసి బాధ్యతల నుండి తప్పుకున్నారు. శ్రీధర్ బాబు అక్కడకు ఒక్కసారి వెళ్లి మాత్రమే సమావేశంలో పాల్గొన్నారు.
కడప జిల్లా రైల్వే కోడూరుకు మంత్రి డికె అరుణను ఇంచార్జిగా నియమించారు. అయితే ఆమె ఇప్పటి వరకు అక్కడ పర్యటించింది లేదు. సొంత జిల్లాలోని ప్రభుత్వ కార్యక్రమాలలో ఆమె బిజీ బిజీగా ఉన్నారు. ఇటీవల కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగడంతో ఆమె పూర్తిగా తన దృష్టిని అక్కడే పెట్టారు. ఇప్పుడు తన జిల్లా, నియోజకవర్గంపై దృష్టి పెట్టాలని ఆమె భావిస్తున్నారని చెబుతున్నారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక ఆమె నియోజకవర్గానికి వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
రాయచోటి నియోజకవర్గానికి ఇంచార్జిగా ఉన్న హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డిది డికె అరుణకు భిన్నంగా లేదు. సబిత ఇప్పటి వరకు రాయచోటిలో పర్యటించలేదు. ఆమె కూడా నోటిఫికేషన్ వెలువడ్డాకే వెళ్లాలనే అభిప్రాయంలో ఉన్నారని తెలుస్తోంది. ఎమ్మిగనూరు నియోజకవర్గానికి ఇంచార్జిగా ఉన్న చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్కి, స్థానిక లోకసభ సభ్యుడు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డికిమధ్య విభేదాలు ఉన్నాయి.
దీంతో అక్కడ టిజి పర్యటించాలని ఓ వర్గం డిమాండ్ చేస్తుండగా, ఇక్కడ ఎంపియే కీలకమని ఆయన అవసరం లేదని మరో వర్గం పట్టుబడుతోందట. వీరి మధ్య సమన్వయం కుదర్చలేక అధిష్టానానికి తలబొప్పి కడుతుందంటున్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గానికి మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి ఇంచార్జ్. ఇక్కడి కాంగ్రెసు అభ్యర్థి గంగుల ప్రతాప రెడ్డి ఆయన ఇంచార్జిత్వాన్ని ఆమోదించడం లేదట. నిన్నటి వరకు పార్టీపై అసంతృప్తితో ఉన్న గంగుల ఇప్పుడు ఏరాసుపై అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఏం చేయాలా అని పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారు.
గుంటూరు జిల్లాలో మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ, ఎంపి రాయపాటి సాంబశివ రావు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ప్రత్తిపాడు నియోజకవర్గంపై ఎవరికి వారే పట్టుబడుతుండటంతో పార్టీ పెద్దలలో అలజడి ప్రారంభమైంది. దీంతో చేసేది లేక వీరిద్దరికి చెరొక మండలం బాధ్యతలను అప్పగించారు.