చిరు వచ్చినా, టిఎస్సార్ అవి తెచ్చినా అంతే: బాబు
వైయస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి తమ పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, 200 మంది పార్టీ నాయకులను పొట్టన పెట్టుకున్నారని, పరిటాల రవిని దారుణంగా హత్య చేశారని ఆయన అన్నారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు రెండూ ఒక్కటేనని ఆయన అన్నారు. నెల్లూరు పార్లమెంటు స్థానంలో తమ పార్టీదే విజయమని ఆయన అన్నారు.
కాంగ్రెసు చేతగాని పార్టీ అని ఆయన అన్నారు. కాంగ్రెసులోకి చిరంజీవి వచ్చినా, టి. సుబ్బిరామిరెడ్డి సూట్కేసులు తెచ్చినా ఆ పార్టీ గెలువదని ఆయన అన్నారు. తన ప్రభుత్వ హయాంలో రౌడీలు రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయారని ఆయన చెప్పారు. రాష్ట్రం ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉందని, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ దొంగ సారా అమ్ముతున్నాడని ఆయన అన్నారు.
బ్యాంక్ ఖాతాలను సిబిఐ స్తంభింపజేయడం వల్ల సాక్షికి అన్యాయం జరుగుతోందని కొన్ని చానెళ్లు వంత పాడుతున్నాయని ఆయన అన్నారు. తాము 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నా పత్రికలు, టీవీ చానెళ్లు పెట్టలేదని ఆయన అన్నారు. కార్యకర్తల త్యాగాల వల్లనే తమ పార్టీ నిలబడిందని ఆయన చెప్పారు. తమ పార్టీకి కార్యకర్తలే ప్రాణమని ఆయన అన్నారు. అధికారం కోసం, సంపాదన కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించలేదని, పేదవారి కోసమే పార్టీని స్థాపించామని ఆయన చెప్పారు. తమ పార్టీ విజయవాడ నాయకుడు దేవినేని ఉమామహేశ్వర రావును వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి లాక్కుని ఏమీ చేయలేరని ఆయన అన్నారు.