సాక్షిని మూయించాలనే: జగన్, సిబిఐపై మండిపాటు

రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ దిగజారిపోయిందని, దీన్ని చూస్తుంటే బాధేస్తోందని అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, గోనెగండ్ల, నందవరం మండలాల్లో జరిగిన రోడ్షోలో ఆయన పాల్గొన్నారు. భ్రష్టు పట్టిన రాజకీయాలను తొలగించి నీతి, నిజాయితీగల రాజకీయ వ్యవస్థను తీసుకొచ్చేందుకు ప్రజలు సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరారు. రిమోట్ కంట్రోల్ ద్వారా రాష్ట్రాన్ని పాలిస్తున్న ఢిల్లీ పెద్దల దిమ్మతిరిగే లా ఉప ఎన్నికల్లో ఓట్లు వేయాలన్నారు.
రాష్ట్రంలో పత్రికాస్వేచ్ఛ హరించుకుపోతోందని, ఆంధ్రజ్యోతి గీసిందే గీత ఈనాడు రాసిందే రాత టివి 9 కూసిందే కూతగా మారిపోయి మా పత్రిక, టీవీ చానల్ను తొక్కేసేందుకు కుట్ర పన్నుతున్నాయన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం, కాంగ్రెస్ తప్ప మరో పార్టీ ఉండకూడదా? ఐదేళ్లు ఒక పార్టీకి, మరో ఐదేళ్లు ఇంకో పార్టీకి ఓట్లు వేసి వారినే గెలిపించాలా? మూడోపార్టీ ఉండకూడదా? ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు.
సిబిఐ పక్షపాతంగా పని చేస్తోందని విమర్శించారు. మరణించిన వైయస్ రాజశేఖర రెడ్డి పట్ల ఒకరకంగా, బతికున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పట్ల మరో రకంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఈ వ్యవస్థను ప్రక్షాళణ చేసి నిజాయితీని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications