జగన్పై కిరణ్ దూకుడు: 'కోవర్టు' ఎఫెక్టా?, రాత్రే సంతకం

కిరణ్ కేబినెట్లోని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి, మాజీ మంత్రి శంకర రావు ముఖ్యమంత్రిపై తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. జగన్కు కిరణే పెద్ద కోవర్టు అని వారు మండిపడ్డారు. డిఎల్ ఇలా వ్యాఖ్యానించిన తర్వాతే జగన్ పైన కిరణ్ తీరు మారినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా ఇవే ఆరోపణలు చేస్తుంది. కిరణ్, జగన్ అపూర్వ సహోదరులు అని, జగన్కు పెద్ద కోవర్టు కిరణ్ అని టిడిపి ఆరోపిస్తోంది.
ఈ నేపథ్యంలో వారి ఆరోపణలను సమర్థవంతంగా తిప్పి కొట్టేందుకే కిరణ్ ఇంత దూకుడుగా వెళుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. డిఎల్ వ్యాఖ్యల అనంతరం జగన్ పైన కిరణ్ విమర్శల దాడిని క్రమంగా పెంచారు. ముఖ్యమంత్రి పీఠం కోసమే జగన్ పార్టీని వీడి వెళ్లాడని, అధికారం కోసం ఏమైనా చేస్తాడని, అందుకోసమే తన వర్గం నేతలతో రాజీనామా చేయించాడని, నేరస్థులతో జగన్కు సంబంధముందని, అలాంటి వ్యక్తి రాజకీయలకు పని రాడని ఉప ఎన్నికల ప్రచారంలో ఘాటైన విమర్శలు చేశారు.
అదే సమయంలో చట్టపరంగా కూడా జగన్ పైన పావులు కదుపుతున్నారని అంటున్నారు. సిబిఐ జగన్ మీడియా బ్యాంకు ఖాతాల స్తంభన చేసిన మరుసటి రోజే ప్రకటనలు నిలుపుదల చేస్తూ ప్రభుత్వం జివోను జారీ చేసింది. ఆ తర్వాత ఆస్తుల స్వాధీనం వైపు దృష్టి సారించింది. మొదట జగన్ మీడియా ఆస్తులను జప్తు చేసుకునేందుకు రంగం సిద్ధమైందని అంటున్నారు. గురువారం ఏ క్షణంలోనైనా జివో జారీ కావొచ్చని చెబుతున్నారు.
ఆ తర్వాత జగన్కు సంబంధించిన ఆస్తులను జప్తు చేయవచ్చునని అంటున్నారు. సిబిఐ కూడా ప్రభుత్వానికి జగతి పబ్లికేషన్స్, జనని ఇన్ ఫ్రా, ఇందిరా టెలివిజన్ సంస్థల క్రయ విక్రయాలను నిలుపుదల చేయాలంటూ ప్రభుత్వానికి లేఖ రాసింది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం వెంటనే దానికి సమ్మతించింది. జగన్ మీడియా ఆస్తుల జప్తుకు సంబంధించి కూడా బుధవారం రాత్రి వ్యూహాత్మకంగా పావులు కదిపారని అంటున్నారు. ఇందుకు సంబంధింటిన నోట్ ఫైల్ పైన కిరణ్, హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి రాత్రి సంతకం చేశారు. ఇది మూడోకంటికి తెలియకుండా చకచకా జరిగిపోయిందని అంటున్నారు.












Click it and Unblock the Notifications