టార్గెట్ జగన్: తెలంగాణ కార్డు వాడుతున్న కిరణ్, బాబు

తెలంగాణకు అనుకూలంగా వైయస్ జగన్ వ్యవహరిస్తున్నారని ఆయన పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. ఆ రకంగా సీమాంధ్ర ఓటర్లను కాంగ్రెసుకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వైయస్ జగన్ తమకు ప్రధాన ప్రత్యర్థి అని భావించడం వల్లనే కిరణ్ కుమార్ రెడ్డి ఆ విషయాన్ని ప్రతి ప్రసంగంలోనూ అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ప్రస్తావిస్తున్నారని అంటున్నారు. ఇదే రకమైన ఆరోపణను తెలుగుదేశం పార్టీ అద్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. తెరాసకు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మధ్య అవగాహన ఉందని తెలుగుదేశం పార్టీ నాయకులు మొదటి నుంచీ మాట్లాడుతూనే ఉన్నారు.
తాజాగా, చంద్రబాబు మరో వ్యాఖ్య చేశారు. కాంగ్రెసుకు వ్యతిరేకంగా ఆ వ్యాఖ్య చేసినట్లు అర్థమవుతోంది. తమ పార్టీని దెబ్బ తీయడానికి కాంగ్రెసు పార్టీ సీమాంధ్రలో వైయస్ జగన్ను, తెలంగాణలో కెసిఆర్ను వాడుకుంటుందని ఆయన శుక్రవారం తన ప్రచార ప్రసంగంలో అన్నారు. అంతేకాదు, చిరంజీవిని కూడా అందుకు వాడుతోందని అన్నారు. చిరంజీవి సమైక్యవాదాన్ని సమర్థిస్తున్నారు. సమైక్యవాదిగా నిలబడిన చిరంజీవి ద్వారా కాంగ్రెసు ప్రయోజనం పొందాలని చూస్తున్నట్లు ఆయన వ్యాఖ్యకు అర్థంగా చెప్పవచ్చు.
కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల ప్రచారాన్ని తిప్పికొట్టడానికి తెరాస దూకుడుగా వ్యవహరిస్తోంది. వైయస్ జగన్తో తమకు అవగాహన ఉన్నట్లు ప్రజల్లోకి వెళ్తే పరకాల ఉప ఎన్నికలో తమకు నష్టం జరిగే ప్రమాదం ఉండడంతో తెరాస నాయకులు జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ను అరెస్టు చేయాల్సిందేనని తాజాగా తెరాస నాయకుడు వినోద్ కుమార్ అన్నారు. వైయస్ జగన్ ఆస్తులపై జరుగుతున్న సిబిఐ దర్యాప్తును సమర్థించారు. కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు వైయస్ జగన్ను సమైక్యవాద వ్యతిరేకిగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తుంటే, తెరాస తెలంగాణ వ్యతిరేకిగా ముద్ర వేయడానికి ప్రయత్నిస్తోంది.
ఉప ఎన్నికలు జరుగుతున్న 18 శాసనసభా స్థానాల్లో, ఒక లోకసభ స్థానంలో పరకాల సీటు మాత్రమే తెలంగాణలో ఉంది. అత్యధిక సీట్లు సీమాంధ్రలో ఉండడంతో తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలను పరోక్షంగా చేయడం ద్వారా ప్రయోజనం పొందవచ్చుననేది కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications