జగన్ కేసులో ట్విస్టు: జప్తునకు జీవో, ఈడి దూకుడు

ఆస్తుల జప్తునకు సంబంధించిన జీవోలను కాన్ఫిడెన్షియల్గా పేర్కొంటూ ప్రభుత్వం నెట్లో పెట్టింది. జీవో ప్రతులను ప్రభుత్వం సిబిఐకి పంపించింది. ఈ జీవోల ఆధారంగా సిబిఐ రేపు శనివారం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. కోర్టు అనుమతితో సిబిఐ జగన్ మీడియా ఆస్తులను జప్తు చేసే అవకాశాలున్నాయి. జగన్ మీడియా సంస్థల బ్యాంకు ఖాతాలను ఇప్పటికే సిబిఐ స్తంభింపజేసింది. ఆస్తుల జప్తు జీవోతో కేసు మరో మలుపు తిరిగే అవకాశాలున్నాయి.
ఇదిలా వుంటే, ఈడి కూడా జగన్ ఆస్తుల కేసులో దూకుడు ప్రదర్సిస్తోంది. వైయస్ జగన్ ఆస్తుల కేసులోనే కాకుండా ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసు, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) అక్రమ మైనింగ్ కేసుల్లో నిందితుల విచారణకు ఈడి పిటిషన్ దాఖలు చేసింది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో మొదటి చార్జిషీట్ను సిబిఐ నుంచి పొందడానికి ఈడి ఇప్పటికే కోర్టు అనుమతి పొందింది. ఈ మూడు కేసుల్లో జైలులో ఉన్న నిందితులను విచారించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈడి తాజాగా పిటిషన్ దాఖలు చేసింది.
వైయస్ జగన్ ఆస్తుల కేసులో నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానందరెడ్డి చంచల్గుడా జైలులో ఉన్నారు. విజయసాయి రెడ్డికి బెయిల్ లభించింది. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో బిపి ఆచార్య, సునీల్ రెడ్డి, కోనేరు ప్రసాద్, ఒఎంసి కేసులో శ్రీనివాస రెడ్డి, శ్రీలక్ష్మి జైలులో ఉన్నారు. ఒఎంసి కేసులో గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ లభించింది. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో విజయరాఘవకు కోర్టు బెయిల్ నిరాకరించింది. కాగా, తనకు ప్రత్యేక హోదా ఖైదీగా గుర్తించాలని కోరుతూ నిమ్మగడ్డ ప్రసాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కాగా, ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో ఐఎఎస్ అధికారులు బిపి ఆచార్యను, ఎల్వీ సుబ్రహ్మణ్యంలను విచారించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ సిబిఐ కోర్టులో మెమో దాఖలు చేసింది. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ల కింద వారి విచారణకు ప్రభుత్వాలు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఐపియస్ సెక్షన్ల కింద విచారణకు అనుమతి ఇవ్వాలని సిబిఐ కోర్టును కోరింది. వీరిద్దరిలో అరెస్టయి బిపి ఆచార్య జైలులో ఉండగా, ఎల్వీ సుబ్రహ్మణం బయటనే ఉన్నారు.












Click it and Unblock the Notifications