దొందు దొందే!: బాబుకు, జగన్కు తేడాలేదన్న కిరణ్రెడ్డి

జగన్ కూడా కన్నతల్లి వంటి కాంగ్రెసు పార్టీని, రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని మోసం చేశారని మండిపడ్డారు. పార్టీకి వెన్నుపోటు పొడవొద్దన్న తన తండ్రి అయిన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మాటలు జగన్ మర్చిపోయారన్నారు. అలాంటప్పుడు బాబుకు, జగన్కు తేడా ఏముందని ప్రశ్నించారు. వైయస్ను సోనియా గాంధీయే రెండుసార్లు ముఖ్యమంత్రిని చేశారన్నారు.
వైయస్ను ముఖ్యమంత్రిగా చేసిన కాంగ్రెసునే ఓడించాలని జగన్ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. జైలులో ఉండే వ్యక్తులు ప్రజలకు ఏం సేవ చేస్తారని అన్నారు. జైలుకెళ్లిన వ్యక్తులకు ప్రజలు ఓట్లు వేయరన్నారు. స్థానిక వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కాపు రామచంద్రా రెడ్డి గురువు ఇప్పటికే జైలులో ఉన్నారన్నారు. ఈయన కూడా ఎప్పుడైనా జైలుకు వెళ్లవచ్చన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడి గనులను దోచుకున్నారన్నారు. అలాంటి వ్యక్తిని ఆదరిస్తే అంతే అన్నారు. మూడేళ్లుగా రాయదుర్గం అభివృద్ధికి కాపు కృషి చేయలేదన్నారు. కాంగ్రెసు పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే రెండేళ్లలో ఎంతో అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రజలు, కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే పాటిల్ వేణుగోపాల్ రెడ్డి అప్పుడే గెలిచినట్లుగా కనిపిస్తోందన్నారు.
2014 వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి ఢోకా లేదన్నారు. గత ఎమ్మెల్యే హయాంలో రాయదుర్గం అభివృద్ధి చెందలేదని, కాంగ్రెసుకు ఓటేస్తే రాయదుర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పారు. వేణుగోపాల్ రెడ్డి స్థానికుడని చెప్పారు. స్థానికుడికి ఓటు వేయాలా స్థానికేతరుడికా అని ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు.
వేణుగోపాల్ రెడ్డిని ఎమ్మెల్యే చేసేందుకే కాపు రామచంద్ర రెడ్డి రాజీనామా చేశారన్నారు. కాంగ్రెసు ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం, తెరాస, బిజెపితో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. అవినీతి డబ్బును కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి పదవి కోసం, సిఎం పదవి కోసం ఇతర పార్టీలతో కుమ్మక్కవుతున్నారన్నారు.
ప్రభుత్వం పథకాలపై జగన్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇంటి కట్టుకునే పేదలకు ఇచ్చే నిధులు పెంచామని, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని అదే తమ ప్రభుత్వం చేసిన తప్పా అని ప్రశ్నించారు. వైయస్ తమ పార్టీ నేత అని, అతనిని తాము ఎప్పుడూ కించపర్చలేదన్నారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డియే ఆయన తండ్రికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి అన్నారు. తల్లి వంటి కాంగ్రెసును పడగొట్టాలనుకోవడం తండ్రికి వెన్నుపోటు పొడవడమే అన్నారు. రాహుల్ గాంధీని 2014లో ప్రధానమంత్రిగా పని చేయడమే లక్ష్యంగా వైయస్ పని చేశారన్నారు. వైయస్ పైన కాంగ్రెసు నేతలకు ఎప్పుడూ వ్యతిరేకత లేదనన్నారు. ఆయనను ఎవరైనా విమర్శిస్తే వారికి సమాధానం చెప్పేందుకు మేము ముందుండేవాళ్లమన్నారు.












Click it and Unblock the Notifications