జగన్ కేసు: ఏడు గంటల పాటు మోపిదేవి విచారణ
మోపిదేవిని రేపు గురువారం మరోసారి సిబిఐ అధికారులు విచారించే అవకాశాలున్నాయి. రేపు అవసరమైతే విచారణకు రావాలని సిబిఐ అధికారులు చెప్పినట్లు మోపిదేవి మీడియా ప్రతినిధులతో చెప్పారు. మోపిదేవిని సిబిఐ అధికారులు బుధవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ప్రశ్నించారు. ఆయన సాయంత్రం ఆరు గంటలకు దిల్కుషా అతిథి గృహం నుంచి బయటకు వచ్చి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
వాన్పిక్ వ్యవహారంలో తన పాత్ర గురించి సిబిఐ అధికారులు ప్రశ్నించినట్లు మోపిదేవి మీడియా ప్రతినిధులతో చెప్పారు. మంత్రి వర్గ నిర్ణయానికి, వాన్పిక్కు అప్పగించిన భూముల వివరాలకు మధ్య తేడా ఉందని సిబిఐ అధికారులు అన్నారని, దాని గురించి వారు తనను అడిగారని ఆయన చెప్పారు. తనకు తెలిసిన సమాచారాన్ని సిబిఐకి వివరించినట్లు ఆయన తెలిపారు. వాన్పిక్ భూముల వ్యవహారంపై సిబిఐ అధికారులు తనను ప్రశ్నించినట్లు ఆనయ తెలిపారు.
జోవోల జారీ విషయంలో తనపై పెద్దల ఒత్తిడి ఉందని ప్రభుత్వాధికారి బ్రహ్మానంద రెడ్డి చెప్పినట్లు సమాచారం. ఎవరు ఒత్తిడి చేశారు, ఎందుకు ఒత్తిడి చేశారనే విషయాలను సిబిఐ అధికారులు రాబట్టే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ఉదయం పదకొండు గంటలకు సిబిఐ కార్యాలయానికి వచ్చే సమయంలో మీడియా ప్రతినిధులు మోపిదేవిని మాట్లాడించే ప్రయత్నం చేశారు. అందుకు ఆయన స్పందిస్తూ.. తాను సిబిఐ ఎదుట హాజరై వచ్చాక మాట్లాడుతానని, ఇప్పుడేం మాట్లాడనని చెప్పారు. కాగా మోపిదేవి సిబిఐ ఎదుట హాజరవడం ఇది రెండోసారి.