జగన్పై పుకార్లకు త్వరలోనే తెర దించుతాం: డిజిపి

ఉత్తరాంధ్ర జిల్లాల ఎస్పీలు, డీఎస్పీలతో బుధవారం ఆయన భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను గవర్నర్ను కలిసినట్లు వచ్చిన వార్తలు వాస్తవమేనని స్పష్టం చేశారు. జగన్ వ్యాఖ్యలు నిరాధారమని కొట్టిపారేశారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి అవి తన పేరు మీద చలామణీ చేసేలా కుట్ర జరుగుతోందని జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.
ఇందుకు ఆధారాలు చూపాలని ఆయన మీడియా ముఖంగా జగన్ను అడిగారు. ఈ వ్యాఖ్యలను జగన్ విజ్ఞతకే వదిలివేస్తున్నామని, శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రాష్ట్రంలో పోలీసులు ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. పోలీసులు అల్లర్లను అదుపు చేస్తారని, అల్లర్లు సృష్టించరని ఆయన అన్నారు. సీనియర్ పోలీసు అధికారులపై కొంత మంది అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని ఆయన అన్నారు.
కేంద్ర మంత్రి వాయలార్ రవిని తాను ఎప్పుడూ కలుసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. వైయస్ జగన్పై ఊహాగానాలు నమ్మవద్దని ఆయన కోరారు. ఉప ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో గట్టి నిఘా పెట్టినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం 33 కంపెనీల బలగాలు అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు. గవర్నర్ నరసింహన్ను తాను విధుల్లో భాగంగానే కలిశానని ఆయన చెప్పారు. పాయకరావుపేటలో రెండు కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications