రంగంలోకి ఈడి: టీ కావాలా అన్న జెడి, నో అన్న జగన్

సిబిఐతో పాటు ఈడి కూడా విచారించేందుకు సిబిఐ కార్యాలయానికి చేరుకుంది. నలుగురు సభ్యుల ఈడి బృందం సిబిఐ కార్యాలయానికి వచ్చింది. సిబిఐ ప్రశ్నించిన అనంతరం ఈడి కూడా జగన్ను ప్రశ్నించే అవకాశముంది. అలాగే సిబిఐ విచారణలో జగన్ చెబుతున్న వివరాలను తెలుసుకునేందుకు కూడా ఈడి బృందం వచ్చింది. ఇప్పటికే ఈ కేసులో సిబిఐ కోర్టుకు సమర్పించిన మొదటి ఛార్జీషీటును ఈడి తీసుకుంది.
ఈ నేపథ్యంలో జగన్ కంపెనీలలోకి వాన్పిక్ పెట్టుబడులు, భారతీ, కార్మెల్ ఏషియా, సండూరు తదితర కంపెనీలలోకి విదేశాల నుండి ఏమైనా డబ్బులు వచ్చాయా, నిమ్మగడ్డ ప్రసాద్ విదేశాల నుండి డబ్బులు తరలించారా అనే కోణంలో ఈడి జగన్ను ప్రశ్నించనుంది. మనీలాండరింగ్ ద్వారా జగన్ కంపెనీలలోకి ఏమైనా వచ్చాయా, వస్తే ఎన్ని వచ్చాయి అని ఆయనను నుండి అడిగి తెలుకునే అవకాశముందని తెలుస్తోంది.
సిబిఐ అధికారులు జగన్తో పాటు జగతి పబ్లికేషన్స్ ప్రతినిధులను కూడా విచారిస్తున్నారు. జగతి ఫైనాన్షియల్ హెట్ను పిలిపించిన సిబిఐ జగన్ సమక్షంలోనే జగతిలోకి వచ్చిన పెట్టుబడులపై ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా జగన్ సిబిఐ కార్యాలయానికి రాగానే సిబిఐ అధికారులు ఆయన గన్మెన్లతో సహా వచ్చిన నేతలను బయటకు పంపించారు.
ఈ సందర్భంగా సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ.. జగన్ను స్వయంగా పలకరించారు. ఆర్ యు కంపర్టబుల్ అని జెడి ఆయనను అడిగారు. అందుకు జగన్.. యస్ ఐయామ్ కంపర్టబుల్ అని చెప్పారు. మంచినీళ్లు తీసుకుంటారా టీ తీసుకుంటారా అని అడిగారు. అందుకు జగన్ నో అని చెప్పారు. ఆ తర్వాత జగన్ను అధికారులు లోనికి తీసుకు వెళ్లి కుర్చీలో కూర్చోబెట్టి ప్రశ్నిస్తున్నారు. కాగా పలు ప్రాంతాలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు ఆందోళన చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications