వైయస్ చెప్పినట్లే చేశా, మళ్లీ మంత్రినవుతా: మోపిదేవి

Mopidevi Venkataramana
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఆదేశాల మేరకే ఆయన కార్యాలయంలోని పెట్టుబడులు, మౌలికవసతుల శాఖ పర్యవేక్షణ అధికారి సమక్షంలోనే వాన్‌పిక్ ప్రాజెక్టుకు అనుమతించే 29వ నెంబరు జివోకు సంబంధించిన ఫైలుపై సంతకం పెట్టానని మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. ఆయన గురువారం సిబిఐ తనను అరెస్టు తన మంత్రి పదవికి రాజీనామా చేస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. లేఖ పూర్తి సారాంశం...

''గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఈ రోజు సిబిఐ వారు నన్ను విచారణకు పిలిపించి వాన్‌పిక్ ప్రాజెక్టుకు సంబంధించి జిఒ నెంబర్ 29లో నేను సంతకం చేసినందున అందులో తప్పులు ఉన్నట్లు ఆరోపించారు. కానీ ఆ ప్రాజెక్టుకు సంబంధించి నా పరిధిలో నేను ఎటువంటి తప్పు చేయలేదు. అధికారుల ప్రతిపాదనల మేరకు, మంత్రి వర్గం మరియు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పనిచేసియున్నాను. నేనుగా ఎటువంటి స్వంత నిర్ణయములు తీసుకోలేదు. ఎటువంటి తప్పిదాలు చేయలేదు.

నేను ఎప్పుడూ నాయకుడిని మరియు పార్టీని నమ్ముతూ మరియు ఆదేశాలు పాటించే క్రమంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సంబంధిత ఫైల్స్ నా కార్యాలయమునకు రాకున్ననూ, వారి కార్యాలయమునకు పిలిపించి వారి కార్యదర్శి సమక్షంలో సంతకాలు పెట్టడం జరిగింది. ఏది ఏమైనా నాయకుడి ఆదేశాలు పాటించాలి కాబట్టి మంచి కోసమే సంతకాలు పెట్టడం జరిగింది. అలాగే నేను నా నీతి, నిజాయితీలకు కట్టుబడి మాత్రమే పని చేసియున్నాను.

నేను బలహీనవర్గాలలో అతి వెనుకబడిన మత్య్సకారవర్గానికి చెందిన కుటుంబము నుండి వచ్చి 1987లో నిజాంపట్నం మండల పరిషత్ అధ్యక్షుడిగా కాంగ్రెస్ నుండి గెలిచి నా రాజకీయ జీవితం ప్రారంభించి యున్నాను. ఆ తరువాత 1999, 2004 సంవత్సరములలో కూచినపూడి, 2009 నుంచి రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎన్నిక అయ్యి ఉన్నాను. ఆనాటి నుండి నేటివరకు నియోజకవర్గ ప్రజల మరియు బలహీనవర్గాల అభ్యున్నతికి ఎల్లవేళల కృషిచేస్తూ మరొక ఆలోచన లేకుండా పనిచేయుచున్నాను.

ఇటీవలి కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, విస్తృతంగా ప్రచారంలో ఉన్న కుంభకోణాలలో ఎందరో పెద్దలు, వివిధ రాజకీయ పార్టీల ప్రముఖుల పేర్లు తరచు వినిపిస్తున్నాయి. నేను వాన్‌పిక్‌కు సంబంధించిన విషయంలో ప్రత్యేకించి జి.ఒ. నెం.29 లేదా పోర్టు పరిధి అంశాలలో నేను నూరుశాతం బాధ్యత తీసుకొని ఎలాంటి తప్పిదం చేయలేదని మరొకసారి చెబుతున్నాను.

మీరు కాని, మీడియావారు కాని లేదా మరెవరయినా సరే, అన్ని నోట్‌ఫైల్స్ మరియు జిఒలను పరిశీలిస్తే నాపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని స్పష్టంగా తెలియవస్తుంది. కాంగ్రెస్ పార్టీ కలిగించిన అవకాశాన్ని నేను ఏనాడు దుర్వినియోగ పరచలేదు. ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాలలో బీసీలు దాదాపు 50 శాతం ఉండగా ప్రత్యేకించి మత్య్సకార వర్గ ప్రజలు అధికంగా ఉన్నందున పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం గత నెల రోజులుగా పనిచేస్తున్న విషయం అందరికి తెలిసిందే! కాంగ్రెస్ పార్టీకి బలహీనవర్గాల అండ కొనసాగడానికి నిష్పాక్షిక దర్యాప్తు చేయించాలని కోరుచున్నాను.

అలాగే చట్టపరంగా, న్యాయపరంగా నేను నా నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకొని తిరిగి ప్రజా జీవితంలోకి అలాగే మీ అనుమతితో తిరిగి మంత్రి వర్గంలోనికి రాగలనని నిజాయితీతో కూడిన నమ్మకంతో చెబుతున్నాను. ఈ సందర్భంగా కోర్టుకు మరియు సిబిఐ వారికి పూర్తిగా సహకరిస్తానని తెలియచేస్తున్నాను. అప్పటి వరకు నా రాజీనామాను ఆమోదించవలసిందిగా కోరుచున్నాను'' అని లేఖలో పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+