వైయస్ జగన్ వైపు 35 మంది ఎమ్మెల్యేలు వస్తారా?

సీమాంధ్రకు చెందిన 16 మంది శాసనసభ్యులు, తెలంగాణకు చెందిన 16 మంది శానససభ్యులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోందంటూ ఆ టీవీ చానెల్ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. వైయస్ జగన్ను అరెస్టు చేస్తే ప్రభుత్వాన్ని కూలుస్తామనే సంకేతాలు ఇవ్వడానికే వారు ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. వైయస్ అబిమాన శాసనసభ్యుల జాబితాను తమ వద్ద ఉంచుకుని వైయస్సార్ కాంగ్రెసు నాయకులు వారిని తమ వైపు లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.
తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎంవి మైసురా రెడ్డి జగన్ అరెస్టవుతారనే నేపథ్యంలో, ఆయన సిబిఐ విచారణకు బయలుదేరుతున్న సమయంలో వచ్చి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. శానససభ్యుడు ఆళ్ల నాని వైయస్ జగన్ను కలిశారు. చాలా మంది నాయకులు జగన్కు అండగా నిలబడాలనే ఆలోచన చేస్తున్నారనే విషయాన్ని ఆది తెలియజేస్తోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు అంటున్నారు.
కాగా, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పలువురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి రావచ్చునంటూ ఆ చానెల్ వార్తాకథనం సారాంశం. హైదరాబాదుకు చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత ఆ ప్రయత్నాలు చేస్తున్నారని, తెలుగుదేశం పారటీ నాయకులతో చర్చలు జరుపుతున్నారని ఆ టీవీ చానెల్ తెలిపింది. గతంలో సమస్య ఎదురైనప్పుడు ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసు ప్రభుత్వాన్ని కాపాడిందని, ఇప్పుడు కాపాడడానికి ఎవరూ లేరని, తాము ప్రభుత్వాన్ని కూల్చగలుగుతామని చెప్పడానికి శానససభ్యులు సిద్దమవుతున్నట్లు ఆ టీవీ చానెల్ వ్యాఖ్యానించింది.
వైయస్ జగన్కు అండగా నిలువాలనే ఆలోచన చాలా మంది నాయకులు చేస్తున్నారని, ఎవరు వస్తారనే వివరాలు తనకు తెలియవని, టిడిపి, కాంగ్రెసుల నుంచి ఎంత మంది వస్తారనే విషయం తెలియదని అంబటి రాంబాబు అన్నారు. వైయస్ జగన్ను సిబిఐ శుక్రవారం విచారిస్తోంది. విచారణ అనంతరం జగన్ను అరెస్టు చేస్తారనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఈ స్థితిలో కాంగ్రెసు శాసనసభ్యులు వైయస్ జగన్ వైపు వస్తారనే ప్రచారానికి తెర లేపారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ వెంట తమ పార్టీ శాసనసభ్యులు ఎవరూ వెళ్లబోరని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చెప్పారు.












Click it and Unblock the Notifications