జగనే రెచ్చగొడుతున్నారు, రోజులు లెక్కించాలి: చిరంజీవి

ఆస్తుల కేసులో సిబిఐ ఎందరినో విచారించిందని, పలువురిని అరెస్టు చేసిందని, జగన్ మాత్రం తనను ఒక్కడినే వేధిస్తున్నట్లుగా తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదని అన్నారు. మోపిదేవి వెంకటరమణ తన నిజాయితీని నిరూపించుకుంటారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఏకపక్ష నిర్ణయాల వల్లనే మోపిదేవి సంతకం చేసి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
జగన్ ఇక రోజులు లెక్కబెట్టుకోవాలని చిరంజీవి నరసన్నపేట సభలో అన్నారు. తాను సంపాదించిన అక్రమాస్తులను కాపాడుకోవడమే జగన్ ధ్యేయమన్నారు. విచారణలో మరిన్ని విషయాలు బయటపడతాయన్నారు. జగన్ ఓ పాపాల పుట్ట అని మండిపడ్డారు. తన స్వార్థం కోసం మంత్రులు, అధికారులను బలి చేశారని ధ్వజమెత్తారు. భూమి మీద జగన్ అంత స్వార్థపరుడు లేడన్నారు. జగన్ అధికార దాహం వల్లే ఉప ఎన్నికలు వచ్చాయన్నారు. అవినీతి నేతలను తరిమి కొట్టాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
అల్లర్లపై జగన్ చేసిన వ్యాఖ్యలు అప్రజాస్వామికం అన్నారు. జగన్ వ్యాఖ్యలు, ఆయన వర్గం నేతల చూస్తుంటే అల్లర్లను వారే రెచ్చగొడుతున్నట్లుగా కనిపిస్తోందన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతల వ్యాఖ్యలు సరికాదన్నారు. కాగా చిరంజీవి జిల్లాలో రెండు రోజుల పాటు ప్రచారం చేస్తారు. విశాఖ విమానాశ్రయం చేరుకున్న ఆయనకు కాంగ్రెసు నేతలు ఘన స్వాగతం పలికారు.
తనను అరెస్టు చేస్తారని ముందే ప్రచారం చేసుకొని జగన్ ప్రజల్లో సానుభూతికి ప్రయత్నించారని నిజానికి అరెస్టు చేస్తే తమకే మంచిదని మరింత సానుభూతి వచ్చి ఉప ఎన్నికలలో లాభపడతామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు భావిస్తున్నారని మంత్రి రఘువీరా రెడ్డి తిరుపతిలో అన్నారు. మంత్రులైనా, అధికారులు అయినా చట్టానికి అతీతులు కారన్నారు.












Click it and Unblock the Notifications