పోటీకి నో: ఆఖరి నిమిషంలో బాబుకు ఒంటేరు ఝలక్?

తాను ఉప ఎన్నికలలో పోటీ చేయనని ఆయనతో చెప్పినట్లుగా తెలుస్తోంది. ఉప ఎన్నికలలో తాను ఖచ్చితంగా పోటీ చేయాలంటే ఒంటేరు రెండు షరతులు పెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. పార్టీ నిధులను తన చేతికే ఇవ్వాలనేది మొదటి షరతు కాగా, తన నియోజకవర్గంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పెత్తనం ఉండవద్దని రెండో షరతు బాబు ముందు ఉంచినట్లుగా తెలుస్తోంది.
దీంతో అవాక్కయిన చంద్రబాబు అప్పటికి అప్పుడు ఒంటేరుకు కౌంటర్గా పార్టీ సీనియర్ నేత బీద రవిచంద్రతో నామినేషన్ వేయించారు. ఉప ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ గడువు 25(ఈరోజు)న ముగుస్తుంది. ఆఖరి రోజు ఒంటేరు తాను పోటీ చేయనని, పోటీ చేయాలంటే షరతులు పెట్టడంతో బాబు వెంటనే రంగంలోకి దిగి హడావుడిగా రవిచంద్రచే నామినేషన్ వేయించారు.
తాను పోటీ నుండి తప్పుకుంటానని చెప్పిన ఒంటేరు వేణుగోపాల్పై చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడినట్లుగా తెలుస్తోంది. ఆఖరి నిమిషంలో చెప్పడంపై ఆయన క్లాస్ పీకారని తెలుస్తోంది. అయితే అభ్యర్థుల మార్పుతో తెలుగు తమ్ముళ్లలో గందరగోళం ఏర్పడింది. కాగా చంద్రబాబు గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
కాగా నెల్లూరు టిడిపిలో ముసలం పుట్టిందన్న వార్తలను ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి ఖండించారు. పార్టీలో ఎలాంటి ముసలం లేదన్నారు. నెల్లూరు అభ్యర్థిని తానే అని చెప్పారు. తన స్థానంలో రవిచంద్ర పోటీ చేస్తున్నారనే వార్తలు అవాస్తవం అన్నారు. పలువురు కాంగ్రెసు నేతలను తెలుగుదేశం పార్టీలో చేర్పించే ఉద్దేశ్యంలో భాగంగానే తాను బాబును కలిశానని, అంతకుముంది ఏమీ లేదన్నారు.
మరోవైపు రవిచంద్ర కూడా ముసలం వార్తలను కొట్టి పారేశారు. రెండు రోజుల క్రితం తాను నగరంలో లేనందున ఆలస్యంగా ఈ రోజు డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నట్లు చెప్పారు. అయితే చంద్రబాబు క్లాస్ పీకిన తర్వాతనే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి పోటీకి సుముఖత వ్యక్తం చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications