జగన్ పార్టీలోకి వలసలు: రంగంలోకి కిరణ్, బొత్స

బొబ్బిలి శాసనసభ్యుడు రంగారావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి హైదరాబాదు వచ్చారు. అయితే, ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయానికి చేరుకోలేదు. ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరినట్లు ఆ పార్టీ నాయకులు కూడా ప్రకటించుకున్నారు. కానీ, ఆ తర్వాత అది నిజం కాదని చెప్పారు. హైదరాబాదు వచ్చిన రంగారావు ఎటు వెళ్లారనే విషయం తెలియడం లేదు. ఆయన ఫోన్లో అందుబాటులోకి రావడం లేదు.
వలసల ప్రచారం నేపథ్యంలో శుక్రవారం ఢిల్లీకి వెళ్లాల్సిన బొత్స సత్యనారాయణ దాన్ని రద్దు చేసుకున్నారు. అయితే, రంగారావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మను కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఆయన చేరడం లాంఛనమేనని అంటున్నారు. రంగారావును శంషాబాద్ విమానాశ్రయం నుంచి కిరణ్ కుమార్ రెడ్డి మధ్యవర్తులు తీసుకుని వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. అయితే, వారితో వెళ్లడానికి రంగారావు నిరాకరించినట్లు తెలుస్తోంది.
విజయనగరం జిల్లా పార్వతీపురం ఎమ్మెల్యే కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు వైపు వెళ్తారని భావిస్తున్న శాసనసభ్యుల జాబితాను బొత్స సత్యనారాయణ తెప్పించుకుని, గాంధీభవన్ నుంచి వారిని సంప్రదిస్తున్నారు. మంత్రి మోపిదేవి వెంకటరమణ అరెస్టు నేపథ్యంలో శాసనసభ్యులు తీవ్ర అసంతృప్తికి గురై వైయస్సార్ కాంగ్రెసు వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు. ఏలూరు శాసనసభ్యుడు ఆళ్ల నాని శనివారం వైయస్ జగన్ నివాసానికి వెళ్లి, ఆయన వెంట సిబిఐ కార్యాలయం వరకు కూడా వచ్చారు.












Click it and Unblock the Notifications