గడ్కరీతో రహస్య భేటీ: బిజెపిలోకి సినీనటి జయప్రద

"నిజజీవితంలో రాజకీయాలు చేయలేక పోయాను. నేను రాజకీయాలకు పనికిరాను''అని కొద్ది రోజుల క్రితం ఆమె మీడియాతో అన్నారు. అలాగే తిరుమలలో ఒకసారి త్వరలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి తిరిగి వస్తానని ప్రకటించారు. అయితే ఏ పార్టీలో చేరేదీ చెప్పలేననీ అన్నారు. ఈ వ్యాఖ్యలతో ఉత్తరాది రాజకీయాల్లో జయ హవా ముగిసిందని అంతా భావించారు.
అమర్ సింగ్కు మద్దతు ప్రకటించి సమాజ్వాదీ పార్టీ నుంచి బయటపడిన ఆమెకు మద్దతు కరువైంది. అమర్ సింగ్ స్థాపించిన పార్టీ అభ్యర్థులను ఇటీవలి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గెలిపించడానికి ఆమె చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. దాంతో ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తారని భావించారు. ఆమె తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ, రాష్ట్ర రాజకీయాలు ఆమెకు అనుకూలంగా ఉన్నట్లు కనిపించలేదు.
ఉత్తర ప్రదేశ్లోని రాంపూర్ నియోజక వర్గం నుంచి రెండు సార్లు లోక్సభ సభ్యురాలిగా ఎన్నికైన జయప్రద సమాజ్వాదీ పార్టీలో ఒక వెలుగు వెలిగారు. అమర్ సింగ్కు సమాజ్వాదీ పార్టీతో సంబంధాలు తెగిపోవడంతో జయప్రద పరిస్థితి కూడా సందేహంలో పడింది. ఈ స్థితిలో బిజెపి ఆమెకు ఆలంబనగా నిలిచింది. ఆమె రాంపూర్ లోకసభ స్థానాన్ని అడుగుతున్నట్లు సమాచారం. అయితే, బిజెపి రాంపూర్ సీటు ఇస్తుందా, రాజ్యసభకు ఎంపిక చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications