జగన్ పార్టీలోకి ప్రచారంపై తలసాని:టిడిపిపై నో కామెంట్
తాను బోయిన్పల్లి మార్కెట్ బంద్ వల్ల రైతులు, వ్యాపారులు పడుతున్న ఇబ్బందులను సిఎంకు వివరించినట్లు చెప్పారు. తాను ముఖ్యమంత్రి కలవడంలో ఎలాంటి రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు. వీరు జగన్ పార్టీలోకి వెళ్తున్నారా అని విలేకరులు ప్రశ్నించగా.. అలాంటి ఊహాగానాలు ఎందుకొస్తున్నాయన్నారు.
తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారా అని అడగ్గా.. అది పార్టీ కార్యాలయంలో మాట్లాడుతానని, ఇక్కడ కాదని తప్పించుకున్నారు. మార్కెట్లో జరుగుతున్న బందును పరిశీలించి దానిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరినట్లు చెప్పారు. ఎనభై ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిసారిగా మార్కెట్లో ఆరు రోజుల నుంచి బందు జరుగుతోందని ఆయన వివరించారు.
కాగా గత కొంతకాలంగా టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుపై తలసాని తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. తనకు రాజ్యసభ పదవి ఇవ్వకుండా దేవేందర్ గౌడ్కు ఇవ్వడంపై ఆయన అప్పుడే తన ఆవేదన వెల్లగక్కారు. ఆ తర్వాత గత కొంతకాలంగా ఆయన జగన్ పార్టీలోకి వెళతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది.