పుచ్చకాయలో ఎలుకల మందు.. ఫోరెన్సిక్ రిపోర్ట్ లో షాకింగ్ నిజాలు!
ఆ రాత్రి ఆ కుటుంబం ఎంతో సరదాగా గడిపింది.. బంధువులతో కలిసి విందు ఆరగించింది. కానీ, తెల్లవారుజామున వారు తిన్న ఒక్క పుచ్చకాయ ముక్క.. ఆ నలుగురి పాలిట మృత్యుపాశమైంది. ముంబైలోని భేండీ బజార్ ప్రాంతంలో జరిగిన దొకాడియా కుటుంబం విషాదాంతం వెనుక ఉన్న అసలు కారణాన్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL) ఎట్టకేలకు ఛేదించింది. అంతా అనుకున్నట్లు వారి ప్రాణాలు తీసింది పుచ్చకాయ కాకదు .. అత్యంత ప్రమాదకరమైన 'జింక్ ఫాస్ఫైడ్' అనే ఎలుకల మందు అని నివేదిక తేల్చిచెప్పింది.
ఏప్రిల్ 27న జరిగిన ఈ విషాద ఘటన పోలీసులకు పెను సవాలుగా మారింది. ఆహారంలో విషం ఉందా? లేక మరేదైనా కారణమా? అన్న కోణంలో కలినాలోని ఫోరెన్సిక్ నివేదిక కోసం అధికారులు వేచి చూశారు. బాధితులు వాంతులు చేసుకోవడం వల్ల వారి శరీరంలో విషం మోతాదు చాలా తక్కువగా ఉంది. ఆ చిన్నపాటి ఆనవాళ్లను పట్టుకోవడానికి ఫోరెన్సిక్ నిపుణులు ఏకంగా 54 రౌండ్ల పాటు, 11 రోజుల సుదీర్ఘ పరీక్షలు నిర్వహించాల్సి వచ్చింది. చివరకు మృతుల కాలేయం, మూత్రపిండాలు మరియు కడుపులోని నమూనాలలో జింక్ ఫాస్ఫైడ్ ఉన్నట్లు శాస్త్రీయంగా నిర్ధారించారు.

శరీరంలో ఏం జరిగింది?
ఫోరెన్సిక్ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. జింక్ ఫాస్ఫైడ్ శరీరంలోకి వెళ్లగానే 'ఫాస్ఫైన్' అనే విషవాయువును విడుదల చేస్తుంది. ఈ వాయువు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించగానే రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలు పడిపోయి మనిషి ఊపిరాడక విలవిలలాడుతాడు. ఈ విషప్రయోగం వల్ల మొదట 12 ఏళ్ల చిన్నారి జైనబ్ మరణించగా, చివరగా కుటుంబ యజమాని అబ్దుల్లా ప్రాణాలు కోల్పోయారు. బాధితులు లక్షణాలు కనిపించిన వెంటనే ఆసుపత్రికి వెళ్లినా, అప్పటికే విషం రక్తంలో కలిసిపోవడంతో వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు.
పుచ్చకాయలోకి విషం ఎలా వచ్చింది?
ఈ కేసులో ఇప్పుడు పోలీసుల ముందున్న అతిపెద్ద ప్రశ్న.. పుచ్చకాయలోకి విషం ఎలా ప్రవేశించింది? బయటి నుంచి ఇంజెక్షన్ ద్వారా విషం ఎక్కించే అవకాశం లేదని ఫోరెన్సిక్ అధికారులు స్పష్టం చేశారు. పండు బయటి భాగం కలుషితం కాలేదని, విషం లోపలే ఉందని తేలింది. దొకాడియా నివసించే మొఘల్ బిల్డింగ్లోని వారి ఇంట్లో ఎక్కడా ఎలుకల మందు ఆనవాళ్లు దొరకలేదు. విక్రయించిన చోటే పండులోకి విషం చేరిందా? లేక ఎవరైనా కావాలనే పండులో విషం కలిపారా? అనే కోణంలో డీసీపీ డాక్టర్ ప్రవీణ్ ముండే నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేస్తోంది.
మిస్టరీగా మిగిలిన 'మోటివ్'
దొకాడియా కుటుంబం ఆర్థిక కష్టాల్లో ఉన్నట్లు వస్తున్న వార్తలను పోలీసులు కొట్టిపారేశారు. అబ్దుల్లా అంధేరీలో మొబైల్ యాక్సెసరీస్ షాప్ నడుపుతూ సంతోషంగానే ఉన్నారని సమాచారం. శనివారం రాత్రి చికెన్ పులావ్ తిన్న మిగతా ఐదుగురు బంధువులకు ఏమీ కాకపోవడం, కేవలం పుచ్చకాయ తిన్న నలుగురు మాత్రమే మరణించడం ఈ మిస్టరీని మరింత పెంచుతోంది. ఇది ప్రమాదమా? ఆత్మహత్యా? లేక ప్రణాళికాబద్ధమైన హత్యనా? అన్నది తేలాల్సి ఉంది.














Click it and Unblock the Notifications