వైయస్ విజయమ్మ టెంపో: వెంట కూతురు షర్మిల

నర్సన్నపేట రోడ్షోలో విజయమ్మను చూడడానికి పెద్ద యెత్తను జనాలు వచ్చారు. అయితే, అది ఓట్ల రూపంలోకి మారుతాయా, లేదా అనేది చెప్పలేని స్థితి. అయితే, సెంటిమెంటును మాత్రం పండించడానికి వైయస్ విజయమ్మ ప్రయత్నిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సోదరి షర్మిల కాస్తా దాటిగానే మాట్లాడుతున్నారు. వైయస్ విజయమ్మ తన ప్రసంగంలో కాస్తా తడుముకుంటున్నప్పటికీ రాను రాను రాటు దేలుతారని అంటున్నారు. మరో పది రోజుల పాటు వీరిద్దరు ప్రచారాన్ని కొనసాగించాల్సి ఉంటుంది.
ఇక్కడకు వస్తే తనకు వైయస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర గుర్తుకు వస్తోందని విజయమ్మ అన్నారు. ఆమె ప్రసంగం కాస్తా ఉద్వేగభరితంగానే సాగుతోంది. మీ ప్రేమాభిమానాలు చూస్తుంటే మహానేత మాటలు గుర్తుకు వస్తున్నాయని ఆమె అన్నారు. ఆ రకంగా వైయస్ పేరు చెబుతూ సెంటిమెంటును అద్దుతున్నారు. జగన్ చాలా ధైర్యంగా ఉన్నాడని, ఈ మాటలను ప్రజలకు చెప్పాలని తనను పంపించాడని ఆమె అన్నారు.
జగన్ చట్టాన్ని గౌరవించే వ్యక్తి అని, సిబిఐ అత్యుత్సాహంతో జగన్ను అరెస్టు చేసిందని ఆమె అన్నారు. వైయస్సార్ పథకాలకు ఈ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని, పథకాల అమలుపై ప్రజలకు నమ్మకం పోయందని ఆమె అన్నారు. వైయస్ మరణంపై అనుమానాలున్నాయని, ఆ అనుమానాలను తీర్చాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని ఆమె అన్నారు. ఆనాడు వైయస్ విషయంలో ఏం జరిగిందో ఇప్పుడు వైయస్ జగన్ విషయంలో అదే జరుగుతోందని ఆమె అన్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ పాలనలో రైతులకు, అక్కాచెల్లెళ్లకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. ఈ ఉప ఎన్నికలు రాజకీయాలను మార్చే ఎన్నికలని ఆమె అన్నారు.
జగనన్నను అన్యాయంగా అరెస్టు చేశారని వైయస్ జగన్ సోదరి షర్మిల అన్నారు. తమ కన్నీటిని చూసి నవ్వుతున్నవారికి గుణపాఠం చెప్పాలని ఆమె ప్రజలను కోరారు. వైయస్సార్ కాంగ్రెసు పార్ట్ీకి ఓటేసి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు బుద్ధి చెప్పాలని ఆమె సూచించారు. మళ్లీ రాజన్న రాజ్యం తెచ్చుకోవాలని, జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications