వైయస్ జగన్ వైపు మరో 12 మంది ఎమ్మెల్యేలు?

వీరిలో శివప్రసాద్ రెడ్డి (దర్శి), సురేష్ (ఎర్రగొండపాలెం), ఆదినారాయణ రెడ్డి (జమ్మలమడుగు), విజయకుమార్ (సంతనూతలపాడు), పి. రామాంజనేయులు (భీమవరం), రాపాక వరప్రసాద్ (రాజోలు), కాటసాని రామిరెడ్డి (బనగానపల్లి), జనార్దన్ థాట్రాజ్ (కురుపాం), రాజన్న దొర (సాలూరు), కన్నబాబు (యలమంచిలి) ఉన్నట్లు చెబుతున్నారు. కాకినాడ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, పార్వతీపురం ఎమ్మెల్యే జయమణి ఇప్పటికే వైయస్ విజయమ్మకు మద్దతు ప్రకటించారు.
ప్రస్తుతం జగన్ వైపు వస్తారని చెబుతున్న శాసనసభ్యులు ఇంతకు ముందు జగన్ వెంట నడిచినవారే. వివిధ కారణాల వల్ల వాళ్లు అప్పట్లో వెనక్కి తగ్గారు. చివరకు 17 మంది మాత్రమే ఆయన వెంట మిగిలారు. వీరిలో 16 మంది కాంగ్రెసు పార్టీకి చెందినవారు కాగా, శోభా నాగిరెడ్డి గత ప్రజారాజ్యం పార్టీ శానససభ్యురాలు. ప్రస్తుతం వీరి స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
ఇప్పటికే కాంగ్రెసుకు చెందిన ఇద్దరు శానససభ్యులు రాజీనామాలు చేశారు. మరింత మంది రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో మరో ఆరు నెలల్లో మరోసారి ఉప ఎన్నికలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రాష్టంలో ఏర్పడుతుంది. అటు తెలంగాణ పేరు మీద రాజీనామాల వల్ల, ఇటు వైయస్ జగన్ వైపు రావడానికి చేస్తున్న రాజీనామాల వల్ల రాష్ట్రంలో నిరంతరం ఎన్నికల వాతావరణమే ఉంటోంది.












Click it and Unblock the Notifications