జడ్జికి గాలి లంచం ఎఫెక్ట్: వైయస్ జగన్పై లగడపాటి ఫైర్

దీనిపై విశాఖపట్నంలో ఉన్న లగడపాటి స్పందించారు. దీనిని నిరసిస్తూ.. న్యాయవ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెబుతూ విశాఖపట్నం జివిఎంసి వద్ద మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆయన నిరసన దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గాలి, జగన్ అన్నదమ్ముల్లాంటి వారు అన్నారు. గాలి ఐదు కోట్లు ఇస్తే జగన్ ఏం చేస్తారేమోనని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. అత్యున్నత స్థానంలో ఉన్న పట్టాభి రామారావు డబ్బు ప్రభావానికి లోనుకావడం దురదృష్టకరమన్నారు. పట్టాభి రామారావుపై హైకోర్టు నిర్ణయాన్ని తాను హర్షిస్తున్నానని అన్నారు.
ఆయనపై విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైయస్కు గాలి పెద్ద కొడుకు లాంటివాడని, జగన్ చిన్న కొడుకు అన్నారు. చిన్న కొడుకు ఎంతిస్తాడో అన్నారు. అక్రమంగా వేలకోట్ల రూపాయలు సంపాదించిన అవినీతిపరులు రాజకీయ, న్యాయవ్యవస్థలను ప్రభావితం చేయాలని చూస్తున్నారన్నారు. వ్యవస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి పైనా ఉందన్నారు. వ్యవస్థలు ఎటు వెళుతున్నాయో అర్థం కావడం లేదన్నారు. అమెరికా మాదిరిగా మన దేశంలో కూడా న్యాయమూర్తులపై నిఘా అవసరమన్నారు.
కొందరు వ్యక్తుల వల్ల సమాజం భ్రష్టు పట్టే స్థితికి చేరుకుందని పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ అన్నారు. డబ్బు ప్రభావానికి జడ్జిలు ప్రభావితం కావడం దురదృష్టకరమన్నారు. గాలి, జగన్ దిగజారుడుతనానికి జడ్జి పట్టాభి రామారావు ఉదంతమే నిదర్శనమన్నారు. జడ్జికే డబ్బులు ఎరవేసి బెయిల్ పొందారంటే న్యాయవ్యవస్థ ఎటు పోతుందో అర్థం కావడం లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
కొందరు అవినీతికి ఇది పరాకాష్ఠ అన్నారు. ఫోర్త్ ఎస్టేట్ మీడియాను భ్రష్టు పట్టించారన్నారు. లంచాలు ఇచ్చి బెయిల్ పొందడం విడ్డూరమన్నారు. ఇలాంటి వాళ్లు అధికారంలోకి వస్తే సర్వనాశనమవుతుందన్నారు. జడ్జి పట్టాభి రామారావుకు గాలి డబ్బులు ఇచ్చి బెయిల్ పొందిన అంశంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ, టిఆర్ఎస్ఎల్పీ ఈటెల రాజేందర్, టిడిపి నేత ఎర్రన్నాయుడు స్పందించారు. ఇది చాలా దురదృష్టకరమని, జడ్జిపై చర్యలు తీసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications