గాలికి బెయిల్ వెనుక జగన్ బంధువు: వర్ల రామయ్య
ముందుగా గాలికి బెయిల్ ఇప్పిస్తే తర్వాత జగన్ను కూడా అదే మాదిరిగా బయటకు తీసుకురావచ్చునని సుబ్బా రెడ్డి ముందుండి ఈ వ్యవహారం నడిపించారని చెప్పారు. అవినీతిని వెలుగులోకి తేవడంలో సిబిఐ కృషిని ప్రజలు అభినందిస్తున్నారన్నారు. అదే విధంగా సుబ్బా రెడ్డి పాత్రపై కూడా సిబిఐ విచారణ జరపాలన్నారు. న్యాయ శాఖ మంత్రిగా ఉన్న ఏరాసు ప్రతాప రెడ్డి.. అక్రమ మార్గంలో గాలి బెయిలు పొందడానికి సహకరించడం దారుణమని, ఆయనను మంత్రివర్గం నుంచి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెంటనే తప్పించాలని కోరారు.
చంచల్గూడా జైలులో గాలి జనార్ధన రెడ్డికి అన్ని సౌకర్యాలు కల్పించింది ఏరాసు ప్రతాప రెడ్డేనని, ఇప్పుడు న్యాయమూర్తిని ప్రలోభ పెట్టడానికి కూడా ప్రయత్నించారని, ఆయనకు ఇంకా మంత్రిగా కొనసాగే హక్కు లేదన్నారు. జగన్ పార్టీ నాయకురాలు శోభా నాగి రెడ్డి గురించి మాట్లాడుతూ.. పరిటాల రవి హత్య జరిగిన సమయంలో ఆమె అనంతపురం పార్టీ కార్యాలయంలోనే ఉన్నారని, ఈ హత్యను జగన్ చేయించాడని ఆమె ఆ రోజు ప్రకటన చేశారని అన్నారు.
ఇప్పుడు జగన్ సచ్ఛీలుడని, దేవుడని అంటున్నారని విమర్శించారు. ఆ రోజు నేరస్థుడు ఈ రోజు సచ్ఛీలుడు ఎలా అయ్యాడో ఆమె చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ రోజు శోభా నాగి రెడ్డి చేసిన ప్రకటన కాపీలను ఆయన మీడియాకు చూపించారు. రాష్ట్ర మంత్రివర్గం దొంగల బండి మాదిరిగా తయారైందని, మంత్రివర్గ సమావేశాన్ని త్వరలో చంచల్గూడా జైలులో పెట్టే పరిస్ధితి రానుందని ఆయన వ్యాఖ్యానించారు.