విజయమ్మను అడ్డుకుంటాం, జగన్ గతే: ఒయు జెఎసి
ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాల ముందు విద్యార్థులు మంగళవారం వైయస్ విజయమ్మ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆమెకు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్కు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పరకాలలో విజయమ్మ పర్యటిస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఒయు జెఎసి నాయకులు అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సీమాంధ్రులు తెలంగాణకు వెళ్లాలంటే వీసా అవసరమంటూ తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన వైయస్ రాజశేఖర రెడ్డి బొమ్మతో విజయమ్మ ఎలా పరకాలకు ఎలా వస్తారని వారు అడిగారు. వైయస్ విజయమ్మ పరకాలలో పర్యటించడానికి వస్తే వైయస్ జగన్కు పట్టిన గతే పడుతుందని వారు హెచ్చరించారు.
పరకాల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కొండా సురేఖ శానససభా సభ్యత్వానికి తెలంగాణ కోసం రాజీనామా చేయలేదని, వైయస్ జగన్ కోసం రాజీనామా చేశారని వారన్నారు. ఉప ఎన్నికల తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఎన్నికల తర్వాత మంత్రులు, శానససభ్యులు రాజీనామాలు చేయాల్సి ఉంటుందని ఆయన మంగళవారం నల్లగొండలో అన్నారు.