పురంధేశ్వరి, టిఎస్సార్ మధ్య కోల్డ్వార్: చల్లార్చిన జగన్!
టి.సుబ్బిరామి రెడ్డి(టిఎస్సార్) అనూహ్య పరిస్థితుల్లో నెల్లూరు లోకసభ స్థానం నుండి పోటీ చేస్తున్నారు. విశాఖపట్నం నియోజకవర్గం పురంధేశ్వరి, సుబ్బిరామి రెడ్డి మధ్య విభేదాలు తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. అంతకుముందు టిఎస్సార్ విశాఖ నుండి పోటీ చేసి గెలుపొందారు. అయితే 2004 ఈ టిక్కెట్ను కాంగ్రెసు పురంధేశ్వరికి ఇచ్చింది. ఆ తర్వాత 2009లోనూ ఆమె అక్కడి నుండే రంగంలోకి దిగి గెలుపొందారు.
పురంధేశ్వరి మొదట తనకు ఒంగోలు లేదా గుంటూరు లోకసభ స్థానం టిక్కెట్లు ఇవ్వమని అధిష్టానాన్ని కోరింది. అయితే సామాజిక కోణం దృష్ట్యా ఆ స్థానాల టిక్కెట్లను అధిష్టానం ఆమెకు కేటాయించలేదు. అందుకు బదులు విశాఖ నుండి బరిలో దింపింది. అప్పటి నుండి పురంధేశ్వరి విశాఖకు అతుక్కు పోయారు. గతంలో విశాఖ టిఎస్సార్ నియోజకవర్గం. దీంతో ఇటీవల కొంతకాలం క్రితం టిఎస్సార్.. తాను 2014 ఎన్నికలలో విశాఖ నుండి పోటీ చేస్తానని, పురంధేశ్వరికి వేరే స్థానాలు ఉన్నాయని విలేకరులతో అన్నారు.
ఎన్నికలకు రెండున్నరేళ్ల ముందే ఆయన విశాఖ సీటు తనకే కావాలని అటు కాంగ్రెసుకు, ఇటు పురంధేశ్వరికి మీడియా ద్వారా చెప్పి సంచలనం సృష్టించారు. టిఎస్సార్ వ్యాఖ్యలపై మాట్లాడేందుకు పురంధేశ్వరి నిరాకరించారు. అయితే ఆమె మాత్రం విశాఖను వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించలేదు. టిక్కెట్ల కేటాయింపు అధిష్టానం నిర్ణయం పైన ఆధారపడి ఉంటుందని అమె పరోక్షంగా తాను సీటు వదులుకునేది లేదని స్పష్టం చేశారు. ఆ తర్వాత ఒకటి రెండుసార్లు టిఎస్సార్ తాను విశాఖ నుండి పోటీ చేస్తానని చెప్పారు.
2014 ఎన్నికలలో విశాఖ స్థానం పురంధేశ్వరి, టిఎస్సార్ మధ్య చిచ్చు పెట్టేలా కనిపిస్తోందని అందరూ భావించారు. అప్పట్లో ఇద్దరూ ఒకరిపై మరొకరు అసంతృప్తిగానే కనిపించారని చెప్పవచ్చు. అయితే ఉప ఎన్నికలు పురంధేశ్వరికి పెద్ద ఉపశమనం కలిగించడంతో పాటు, టిఎస్సార్కు ప్రత్యామ్నాయాన్ని చూపించింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో నెల్లూరు స్థానం ఖాళీ అయింది.
నిన్నటి వరకు కాంగ్రెసులో ఉన్న మేకపాటి జగన్ పంచన చేరడంతో ఆయనతో ఉప ఎన్నికలలో పోటీ పడేందుకు అధిష్టానంకు ఎవరూ దొరకలేదు. దీంతో తప్పని పరిస్థితుల్లో అనూహ్యంగా అధిష్టానం టిఎస్సార్ పేరును తెరపైకి తీసుకు వచ్చింది. నెల్లూరు టిఎస్సార్ సొంత జిల్లా. అధిష్టానం మాట జవదాటని టిఎస్సార్ అందుకు అంగీకరించారు. నెల్లూరులో గెలుపొందేందుకు ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఉప ఎన్నికలలో ఫలితాలు టిఎస్సార్కు అనుకూలంగా వస్తే ఆయన 2014 ఎన్నిలలోనూ ఇదే స్థానం నుండి పోటీ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
తాను విశాఖను అభివృద్ధి చేశానని, ఇక నెల్లూరును కూడా అదే స్థాయిలో అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. ఇందుకోసం నెల్లూరులో టిఎస్సార్ కళాపరిషత్ కూడా ప్రారంభించారు. తన గెలుపు కోసం ప్రత్యక్షంగా రాజకీయ ఉద్దండులను, పరోక్షంగా, ప్రత్యక్షంగా సినీ ఉద్దండులను ఉపయోగించుకుంటున్నారు. నెల్లూరులో ఎలాగైనా పాగా వేయాలనే కృత నిశ్చయంతో ఉన్నారు. నెల్లూరులో టిఎస్సార్ గెలిస్తే పురంధేశ్వరికి చాలా రిలీఫ్గా ఉంటుందనే చెప్పవచ్చు.
నిన్నటి వరకు విశాఖ ఇష్యూ కారణంగా ఒకరి పైన మరొకరు అసంతృప్తిగా ఉన్నప్పటికీ టిఎస్సార్ స్థానం చేంజ్ కావడంతో ఇరువురు కలిసి పోయారనే చెప్పవచ్చు. పురంధేశ్వరి ఏకంగా టిఎస్సార్ తరఫున నెల్లూరులో రెండు రోజుల పాటు ప్రచారం కూడా చేశారు. టిఎస్సార్ను గెలిపిస్తే ఆయన అభివృద్ధి చేస్తారని ప్రచారం చేశారు. మొత్తానికి పరోక్షంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి.. ఉప ఎన్నిక తీసుకు రావడం ద్వారా పురంధేశ్వరి, టిఎస్సార్కు మధ్య ఉన్న కోల్డ్ వార్ను చల్లార్చారని చెప్పవచ్చు!