అక్కడ జగన్ను ఢీకొంటాం!: నాలుగింటిపై కాంగ్రెస్లో ఆశ
అయితే కాంగ్రెసు పార్టీ ముఖ్య నేతలు మాత్రం ఈ ఉప ఎన్నికలలో ఖచ్చితంగా నాలుగు స్థానాలు గెలుచుకుంటామని గట్టి విశ్వాసంతో ఉన్నారని అంటున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మంత్రులు, ఇతర ముఖ్య నేతలతో ఉప ఎన్నికల అంశంపై సమావేశమయ్యారు. కిరణ్, బొత్సలు వేరు వేరుగా పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇరువురు నేతలు వేర్వేరుగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఉప ఎన్నికల ఫలితాలపై చర్చ జరిగిందని తెలుస్తోంది.
ఈ సమావేశాలలో మెజార్టీ నేతలు కనీసం నాలుగు స్థానాలలో గెలుస్తామనే ధీమా వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. చిరంజీవి రాజ్యసభకు వెళ్లడంతో ఖాళీ అయిన తిరుపతి స్థానంతో పాటు ఆళ్లగడ్డ, రామచంద్రాపురం, నర్సాపురంలలో గెలుస్తామని వారు భావించినట్లుగా తెలుస్తోంది. చిరంజీవి ఇమేజ్తో పాటు స్థానిక అంశాలతో తిరుపతి, ఆళ్లగడ్డలలో ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారట.
ఇక వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోసు పైన ఉన్న వ్యతిరేకత రామచంద్రాపురంలో గట్టెక్కిస్తుందని, నర్సాపురంలో అన్నదమ్ములు పోటీ పడుతున్న దృష్ట్యా ప్రజలు ధర్మాన రాందాసు వైపే మొగ్గు చూపుతారని భావిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు ఉప ఎన్నికల తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారట. ఉప ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఉంటుందా ఉండదా అనే చర్చ ఇటీవల కాలంలో జోరుగా జరిగిన విషయం తెలిసిందే.