జగన్ సొంత జిల్లాలో సిబిఐ జెడికి అభిమాన సంఘం
వైయస్ జగన్ సొంత జిల్లా కడప జిల్లాలోని దువ్వూరులో సోమవారం జెడి లక్ష్మీ నారాయణకు ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దీనిపై లక్ష్మీ నారాయణ బొమ్మతో పాటు జాతీయస్థాయిలో అవినీతిపై పోరు చేస్తున్న ప్రముఖ సంఘ సంస్కర్త అన్నా హజారే ఫోటోను వేశారు. 'సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ టీమ్కు మద్దతు పలుకుదాం. యువతీ, యువకులారా! మేథావులారా! నిజాయితీ పరులను ప్రోత్సహిద్దాం. దేశాన్ని రక్షిద్దా'మంటూ ఇట్లు దువ్వూరు యువతీ, యువకులు అని ఆ ఫ్లెక్సీ పైన రాశారు.
అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న జెడి లక్ష్మీ నారాయణ.. ప్రలోభాలకు లొంగని నైజం.. నిజాయితీ గురించి వినడమే తప్ప చూడటం అలవాటులేని మన రాష్ట్ర ప్రజలకు నిలువెత్తు నిదర్శనం.. అక్రమార్కుల గుండెల్లో సింహస్వప్నం అంటూ ఫ్లెక్సీలో కితాబు ఇచ్చారు. కాగా అంతకుముందు తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో ప్రజా చైతన్య వేదిక యువజన సంఘం ఇలాంటి ఫ్లెక్సీలు దాదాపు ఇరవై వరకు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
లక్ష్మీ నారాయణ బృందం సభ్యులను ఈ దశాబ్దపు నిజమైన హీరోలుగా అభివర్ణించింది. వీరికి మద్దతు పలుకుదాం! నిజాయితీపరులను ప్రోత్సహిద్దాం! దేశాన్ని రక్షిద్దాం! అంటూ యువతకు, మేధావులకు పిలుపునిచ్చింది! అమలాపురం గడియారం స్తంభం సెంటర్లో సిబిఐ టీమ్కు మద్దతుగా దీనిని ఏర్పాటు చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న నాయకులను చెరసాలలో పెడుతున్న లక్ష్మీ నారాయణకు యువత సంపూర్ణ మద్దతివ్వాలని ఆయన అందులో కోరారు.