జగన్కు డిమాండ్: కాంగ్రెస్కోసం అసదుద్దీన్ రాయబారం!

దాదాపు గంటపాటు ఓవైసీ ములాఖత్ గదిలోనే ఉన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసుకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత, రాజకీయ విషయాలు మాట్లాడి ఉంటారని తెలుస్తోంది. వచ్చే నెలలో రాష్ట్రపతి ఎన్నికలు ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఎన్నికలలో పార్టీ పరంగా అనుసరించబోయే విషయాలను కూడా వారు చర్చించినట్లుగా తెలుస్తోంది.
చంచల్గూడ జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. రాష్ట్రపతి అభ్యర్థిగా యుపిఏ బలపరిచిన ప్రణబ్ ముఖర్జీకి మద్దతివ్వాల్సిందిగా తాను జగన్ను కోరినట్లు మీడియాతో చెప్పారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని జగన్ చెప్పారని ఆయన తెలిపారు. 2014 వరకు రాష్ట్రంలో కాంగ్రెసు ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని ఆయన అన్నారు. కాగా కాంగ్రెసు పార్టీ నేతలు అసదుద్దీన్ను మధ్యవర్తిగా జగన్ వద్దకు పంపించి ఉంటుందని భావిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెసు అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి యుపిఏకు రాంరాం చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రణబ్ ముఖర్జీని గెలిపించుకునేందుకు కాంగ్రెసు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. బిజెపి కూడా ప్రణబ్కు మద్దతిచ్చే అంశంపై చర్చిస్తోంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కూడా ప్రణబ్ వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పరిస్థితులు పూర్తిగా తమ ఆదీనంలో ఉంచుకునేందుకు కాంగ్రెసు ప్రణబ్కు మద్దతును కూడగడుతోంది. అందులో భాగంగానే అసదుద్దీన్ను పంపించి ఉంటారని అంటున్నారు.
రాష్ట్రపతి ఎన్నికలకు ముంది ఉప ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెసు ఘన విజయం సాధించిన తర్వాత జగన్కు డిమాండ్ పెరిగింది! ఉప ఎన్నికల ఫలితాలు విడుదలైన వెంటనే మమతా బెనర్జీ వైయస్సార్ కాంగ్రెసు గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మతో మాట్లాడేందుకు ప్రయత్నించారని వార్తలు వచ్చాయి. అవి నిజమే అన్నట్లు ఆ పార్టీ కేంద్రమంత్రి ముకుల్ వాస్నిక్ విజయమ్మకు స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ముందు రాష్ట్రపతి ఎన్నికలు ఉండటంతో జగన్ను దువ్వే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.
కాగా మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోసు, ఎమ్మెల్యేలు శోభా నాగి రెడ్డి, బాబూరావు, బాలరాజు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావు, వైయస్ వివేకానంద రెడ్డి తదితరులు జగన్ను జైలులో ఈ రోజు కలిశారు.












Click it and Unblock the Notifications