పాకిస్తాన్ షప్తో గాయని గజాలా, తండ్రి కాల్చివేత
కాల్పులు జరిపిన అనంతరం దుండగులు మోటారు బైక్ పైన పారిపోయారు. ఘటనా స్థలంలో ఉన్న గాయని గజాలా సోదరి తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. పష్తో గాయనిగా ప్రజల్లో మంచి పేరు సొంతం చేసుకున్న గజాలా జావేద్ను పాకిస్థాన్లోని పెషావర్ పట్టణంలో కొందరు ఆగంతుకులు కాల్చి చంపడాన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు.
ఈ ఘటనలో ఆమెతోపాటు తండ్రి మొహమ్మద్ జావేద్ కూడా ప్రాణాలు కోల్పోయారు. సంగీతానికి కులం, మతం, జాతి ఇలాంటి భేద భావాలేమీ ఉండవు. ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది ఉగ్రవాదులను తప్ప. దీనికి నిదర్శనమే తాలిబన్లు. సంగీతం ఇస్లాంకు వ్యతిరేకమని ప్రకటించిన తాలిబన్లు కొద్ది సంవత్సరాలుగా ఖైబర్-ఫక్తున్ఖ్వా ప్రావిన్స్ ప్రాంతంలో సంగీత కళాకారులు లక్ష్యంగా హత్యలకు తెగబడుతున్నారు.
వీరి చేతిలో ఇప్పటికే పలువురు కళాకారులు ప్రాణాలు కోల్పోగా.. మరికొంతమంది బతుకు జీవుడా అంటూ వలసపోయారు. అయితే జావేద్ హత్యకు భర్తతో ఉన్న విభేదాలు కూడా కారణం కావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అభిప్రాయభేదాల కారణంగా గత ఏడాది భర్త నుంచి వేరుపడిన గజాలా తండ్రితో కలిసి ఉంటున్నారు.