రాష్ట్రపతి ఎన్నికలు: ఆ ముగ్గురు నేతలూ దూరమేనా?
హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికలకు రాష్ట్రంలోని మూడు పార్టీలు కూడా దూరంగానే ఉంటాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ, కె. చంద్రశేఖర రావు నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కరవబోతే కప్పకు కోపం, వదలమంటే పాముకు కోపమన్నట్లుగా ఈ పార్టీల పరిస్థితి తయారైంది.

ఇటు కాంగ్రెసు పార్టీ నేతృత్వంలోని యుపిఎ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి, అటు బిజెపి బలపరుస్తున్న పిఎ సంగ్మాకు మద్దతు ఇవ్వలేక ఆ మూడు పార్టీల అధినేతలు కూడా సతమతమవుతున్నట్లు అర్థమవుతోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వాలనే విషయంపై నిర్ణయం తీసుకునే బాధ్యతను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు తమ పార్టీ అధినేత వైయస్ జగన్కే వదిలేశారు. మిగతా రెండు పార్టీల విషయంలోనూ అధినేతలదే తుది నిర్ణయమవుతుంది.
యుపిఎ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇవ్వనున్నట్లు తొలుత సంకేతాలు అందించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తర్వాత పునరాలోచనలో పడ్డారు. ప్రణబ్ ముఖర్జీకి మద్దతిస్తే కాంగ్రెసుతో తెలుగుదేశం కుమ్మక్కయిందనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విమర్శలకు బలం చేకూర్చినట్లు అవుతుందని, తమ కాంగ్రెసు వ్యతిరేక వైఖరి బలహీనపడే ప్రమాదం ఉందని పార్టీలోని కొందరు నాయకులు వాదించడంతో చంద్రబాబు వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు.
అదే సమయంలో బిజెపి బలపరుస్తున్నందున సంగ్మాకు మద్దతిచ్చే విషయంపై కూడా తెలుగుదేశం పార్టీ వెనకాడుతోంది. సంగ్మాకు మద్దతిస్తే మైనారిటీలు దూరమవుతారనే భయం తెలుగుదేశం పార్టీకి పట్టుకున్నట్లు సమాచారం. అయితే, ప్రణబ్ ముఖర్జీకి మద్దతివ్వాలని కార్పొరేట్ సంస్థలను నడుపుతున్న పార్టీ నాయకులు కొందరు చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో తటస్థంగా ఉండే విషయంపై చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు.
కాగా, తెరాస అధినేత కె. చంద్రశేఖర రావు కూడా తొలుత ప్రణబ్ ముఖర్జీ వైపు మొగ్గు చూపినట్లు చెబుతారు. అయితే, కెసిఆర్ కాంగ్రెసుతో కుమ్మక్కయ్యారని తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తూ వస్తోంది. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్న కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి ఓట్లేస్తే ప్రజల నుంచి వ్యతిరేక ఎదురయ్యే ప్రమాదం ఉంది. పైగా, ప్రణబ్ ముఖర్జీని బలపరచకూడదని తెలంగాణ జెఎసి పిలుపునిచ్చింది. పరకాల ఉప ఎన్నికల్లో బిజెపిని కాదని తమను బలపరిచిన తెలంగాణ జెఎసినే స్థితిలో తెరాస అధ్యక్షుడు కెసిఆర్ లేరని అంటున్నారు. సంగ్మాను బలపరచడానికి తెరాసకు కూడా బిజెపియే అడ్డు వస్తోంది. దీంతో తటస్థంగా ఉండే విషయంపై కెసిఆర్ కూడా ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు.
రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు, తెరాస రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉంటాయని కాంగ్రెసు పార్టీ కూడా భావిస్తోంది. ఈ స్థితిలో తమ పార్టీకి చెందిన ఓట్లు జారిపోకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో ఉంది.












Click it and Unblock the Notifications