గంజాయి తాగుతూ పట్టుబడ్డ టిడిపి ఎమ్మెల్యే కొడుకు
విచారణలో సునీల్ కుమార్ టిడిపి ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ తనయుడు అని, అభిజిత్ కరీంనగర్ మున్సిపల్ చైర్మన్ తనయుడు అని గుర్తించారు. వీరిద్దరి నుండి పోలీసులు గంజాయితో పాటు డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల పోలీసులు బంజారాహిల్స్ వంటి కాస్ట్లీ ఏరియాలలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై దాడులు జరిపి అరెస్టు చేస్తున్న నేపథ్యంలో ఎవరూ గుర్తించరని ఉప్పల్ గ్రౌండ్సులో వీరు గంజాయి తీసుకుంటుండవచ్చునని అనుమానిస్తున్నారు.
మరోవైపు గురువారం రాత్రి ఫిల్మ్ నగర్లో పేకాట ఆడుతూ పట్టుబడిన 26 మందిని బంజారాహిల్సు పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. కాగా బంజారాహిల్స్ పోలీసులు గురువారం ఫిలిం నగర్లోని ఓ ప్లాట్పై దాడి చేసి పేకాట ఆడుతున్న ఇరవై ఆరు మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అందులో తెలుగుదేశం పార్టీ నేత బిటెక్ రవి కూడా ఉన్నారు. ఆయన రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు దొరికి పోయారు. బిటెక్ రవి పులివెందుల టిడిపి నేత. పట్టుబడిన వారంతా చోటామోటా రాజకీయ నాయకులే కావడం గమనార్హం. బిటెక్ రవితో పాటు ఓ మంత్రి సోదరుని కుమారుడు కూడా పట్టుబడినట్లుగా తెలుస్తోంది.
వీరితో పాటు అనేక రాజకీయ నాయకులు పోలీసుల చేతికి చిక్కారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని ఫిలింనగర్లో కొనసాగుతున్న పేకాట స్థావరంపై పోలీసులు గురువారం దాడి చేశారు. 26 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 21.8 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఫిలింనగర్ కాలనీలో గత కొంతకాలంగా ఓ ఇంటిని అద్దెకు తీసుకుని పేకాట నిర్వహిస్తున్నట్టు సమాచారం అందడంతో బంజారాహిల్స్ పోలీసులు, వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా గురువారం సాయంత్రం దాడి చేశారు.
26 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకోవడంతోపాటు పెద్ద మొత్తంలో నగదును, 28 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాలనుంచి ఇక్కడకు వచ్చి పేకాడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పేకాట రాయుళ్లలో అందరూ రాజకీయ నాయకులే. వీరిలో ఎక్కువమంది కడప జిల్లాకు చెందిన నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా గురువారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో పట్టుబడ్డారు. బిటెక్ రవి గత ఉప ఎన్నికలలో పులివెందుల స్థానం నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే వైయస్ విజయమ్మపై టిడిపి తరఫున పోటీ చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.