మోపిదేవి, పొన్నాలలకు మొండిచేయి: నలుగురికి ఓకే

మరో ఇద్దరు మంత్రులు మోపిదేవి వెంకటరమణకు, పొన్నాల లక్ష్మయ్యకు మాత్రం మొండిచేయి చూపింది. మిగతా నలుగురు మంత్రులు న్యాయపోరాటం చేసేందుకు న్యాయవాదుల ఫీజులను ప్రభుత్వం భరిస్తుంది. మోపిదేవి వెంకటరమణను, పొన్నాల లక్ష్మయ్యను దీని నుంచి మినహాయించడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఎనిమిది మంది ఐఎఎస్ అధికారుల విషయంలో కూడా ప్రభుత్వం మాట్లాడడం లేదు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో 26 వివాదాస్పద జీవోల జారీకి సంబంధించి ఆరుగురు మంత్రులను, ఎనిమిది మంది ఐఎఎస్ అధికారులను విచారించాలని సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. ఈ కేసులో న్యాయ పోరాటానికి అవసరమైన సహాయం అందించాలని మోపిదేవి వెంకటరమణ జైలు నుంచి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. అయినా, ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి సానుకూలంగా ప్రతిస్పందించినట్లు లేదు.
వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ అరెస్టయ్యారు. ఆయన ప్రస్తుతం హైదరాబాదులోని చంచల్గుడా జైలులో ఉన్నారు. తనను సిబిఐ అరెస్టు చేసిన వెంటనే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జారీ అయిన 26 వివాదాస్పద జీవోలపై సిబిఐ విచారణ జరుపుతోంది.
వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ అధికారులు మంత్రులు సబితా ఇంద్రా రెడ్డిని, పొన్నాల లక్ష్మయ్యను ఇది వరకే విచారించింది. కన్నా లక్ష్మినారాయణను, ధర్మాన ప్రసాద రావును కూడా సిబిఐ విచారించే అవకాశం ఉంది.
నలుగురు మంత్రులకు మాత్రమే సహాయం అందిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అడిగిన వారికి మాత్రమే సహాయం అందిస్తూ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెప్పింది. పొన్నాల లక్ష్మయ్య తమను సాయం అడగలేదని స్పష్టం చేసింది. మోపిదేవి వెంకటరమణ ఫైలు ప్రాసెస్లో ఉందని చెప్పింది.












Click it and Unblock the Notifications