కొడాలి నాని: ఆది నుండి దూరమే!, కేవలం ఎన్టీఆర్ వల్లే

టిక్కెట్టు సాధించే విషయంలోనూ ఆయన పట్టుబట్టి మరీ అనుకున్నది సాధించారని చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్తో సాన్నిహిత్యం కారణంగా అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని మరీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 2004లో నానికి గుడివాడ టిక్కెట్ ఇచ్చారు. 2004, 2009లో టిడిపి తరఫున ఆయన విజయం సాధించినా ఎప్పుడూ పార్టీ అధికారిక కార్యక్రమాలకు హాజరయ్యే వారు కాదని అంటున్నారు.
అధినేత ఫోన్లకూ అందుబాటులో ఉండే వారు కాదట. తాజాగా అదే ధోరణితో టిడిపిని వీడేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు. కోస్తా జిల్లాల్లో ఓ ప్రధాన సామాజికవర్గానికి వైయస్సార్ కాంగ్రెసు వల విసురుతోందన్న ప్రచారం నేపథ్యంలో ఆయన సోమవారం హైదరాబాదులో ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మతో, జైలులో ఉన్న పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ కావడం ఆ పార్టీలోకి వెళ్లడం ఖాయమైంది.
కేవలం జూనియర్ ఎన్టీఆర్ పట్టుపట్టడం వల్లనే నానికి టిక్కెట్ కేటాయించారని, నానిని తెలుగుదేశం పార్టీ మోసింది కానీ, ఆయన ఏనాడూ పార్టీని మోయలేదని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. తల్లిలాంటి పార్టీకి ఆయన ద్రోహం చేశారని విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీకి ఆయన ఏనాడు ఊపయోగపడలేదని అంటున్నారు. నమ్మిన జూనియర్ ఎన్టీఆర్ను కూడా మోసం చేశారని అంటున్నారు. జూనియర్కు సన్నిహితుడు అన్న కారణంగానే ఆయనను భరించామని చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా నానితో తనకు సంబంధం లేదని చెప్పడం గమనార్హం.
కొంతకాలంగా నాని కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో ఇటీవల ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ చొరవ తీసుకొని బాబు వద్దకు నానిని తీసుకు వెళ్లారు. అధినేతతో మాట్లాడాక తాను పార్టీలోనే కొనసాగుతానని నాని చెప్పారు. అంతలోనే ఆయన తన మనసు మార్చుకున్నారు. బాలకృష్ణ గుడివాడ నుండి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం నేపథ్యంలో వచ్చే ఎన్నికలలో ఆ టిక్కెట్ వస్తుందో లేదో అనే ఆందోళనతో ఆయన పార్టీకి దూరం కావడమే మంచిదని భావించారని అంటున్నారు.












Click it and Unblock the Notifications