విజయమ్మ ధర్నాపై ఫిర్యాదు: తెలంగాణ తేలనట్లే
భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన వీడియో సీడీలను కూడా ఆజాద్కు ప్రదర్శించి చూపించారు. తెలంగాణపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని తాము కోరామని, పార్లమెంటు సమావేశాల సమయంలో మరోసారి కలుద్దామని ఆజాద్ చెప్పారని పార్లమెంటు సభ్యుడు రాజయ్య మీడియా ప్రతినిధులతో చెప్పారు. దీన్ని బట్టి తెలంగాణ అంశాన్ని ఇప్పట్లో తేల్చడానికి కాంగ్రెసు అధిష్టానం తేల్చడానికి సిద్ధంగా లేదని అర్థమవుతోందని అంటున్నారు.
వైయస్ విజయమ్మ సిరిసిల్ల ధర్నాకు భారీ భద్రత కల్పించడంపై కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరుపై కూడా వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. డిజిపి దినేష్ రెడ్డిపై కూడా వారు ఆజాద్కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణలో బలపడేందుకు కిరణ్ కుమార్ రెడ్డి సహకరిస్తున్నారని వారు ఆజాద్కు ఫిర్యాదు చేశారు. విజయమ్మ పర్యటనలో 15వేల మంది పోలీసులను వినియోగించారని, హెలికాప్టర్ ద్వారా ఏరియల్ నిఘా కూడా ఏర్పాటు చేశారని వారు చెప్పారు. ఇది పార్టీకీ ప్రభుత్వానికీ మంచిది కాదని వారు చెప్పారు.
మెడికల్ సీట్ల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరిగిందని వారు ఆజాద్కు చెప్పుకున్నారు. తెలంగాణ పార్లమెంటు సభ్యులు సమావేశమైన సమయంలోనే ఈ ప్రాంతానికే చెందిన పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్, మంత్రి కె. జానా రెడ్డి ఆజాద్ వద్దకు వచ్చారు. ఆజాద్తో జానా రెడ్డి విడిగా సమావేశమయ్యారు.