జగన్ కేసుఎఫెక్ట్: పార్థసారథి రాజీనామాపై సిఎం వివరణ

పార్థసారథిని మంత్రి వర్గం నుండి తొలగిస్తే పార్టీకి నష్టం జరుగుతుందని, అతను బిసి మంత్రి అయినందున తొందరపడి నిర్ణయం తీసుకోవడం మంచిది కాదని అధిష్టానానికి కిరణ్ వివరణ ఇచ్చారు. మంత్రి త్వరలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో అప్పీల్ చేసుకోనున్నారని చెప్పారు. పైకోర్టులలో తీర్పు వెలువడిన తర్వాత నిర్ణయం తీసుకుంటే బావుంటుందని ఆయన అధిష్టానానికి సూచించినట్లుగా సమాచారం.
ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అరెస్టు జరిగిన విషయం తెలిసిందే. మోపిదేవి అరెస్టుపై బిసి సంఘాలు పెద్ద ఎత్తున మండిపడ్డాయి. జగన్ ఆస్తుల కేసులో ఇతర మంత్రులను వదిలి కేవలం మోపిదేవిని బలి చేయడమేమిటని పలు బిసి సంఘాలు ప్రశ్నించారు. ఈ అఫెక్ట్ కిరణ్ పైన పడినట్లుగా ఉందంటున్నారు.
కాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెసు పార్టీ అధిష్టానం అక్షింతలు వేసిన విషయం తెలిసిందే. మంత్రి పార్థసారథి కేసు విషయమై హైకమాండ్ కిరణ్ కుమార్ రెడ్డి వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. పార్థసారథిచే రాజీనామా చేయించాలని ఢిల్లీ పెద్దలు కిరణ్ను గురువారం ఆదేశించారు. కేంద్రంలోనే అవినీతి ఆరోపణలు వచ్చిన మంత్రులచే రాజీనామా చేయిస్తుంటే రాష్ట్రంలో మాత్రం ఎందుకు మౌనంగా ఉంటున్నారని కిరణ్ను ప్రశ్నించింది.
ఆరోపణలు ఎదుర్కొని కోర్టు కేసులో నేరస్తుడిగా నిర్ధారణ అయిన పార్థసారథిని వెంటనే కేబినెట్ నుండి తొలగించాలని, ఇప్పటి వరకు ఈ కేసు విషయమై తమ దృష్టికి ఎందుకు తీసుకు రాలేదని కిరణ్ పైన అధినాయకులు మండిపడ్డారని వార్తలు వచ్చాయి. దీంతో కిరణ్ వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications