పార్థసారథి సేఫ్: ఆదుకున్న సిఎం కిరణ్ కుమార్ రెడ్డి

తీర్పుపై హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నందున, అక్కడ తుది తీర్పు వచ్చేలోపే సారథి రాజీనామాకు పట్టుబట్టడం మంచి సంకేతాలు ఇవ్వదని ఆయన పార్టీ అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం. అయితే మంత్రులపై ఆరోపణలు వస్తేనే కేంద్రం సీరియస్గా తీసుకుంటున్నందున ఏకంగా జైలుశిక్ష పడిన పార్థసారథిని ఎలా వదిలేయమంటారని ఏఐసీసీ నేతలు అంటున్నట్లు తెలిసింది. అయితే, ముఖ్యమంత్రి ఒత్తిడితో అధిష్ఠానం పునరాలోచనలో పడినట్టు సమాచారం. అదే సమయంలో కృష్ణాజిల్లాకు చెందిన శాసనసభ్యుడు పేర్ని నాని ముఖ్యమంత్రిని కలిసి సారథిని బలి చేయొద్దని కోరారు.
విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ స్వయంగా సారథిని వెంటబెట్టుకుని వెళ్లి మరీ సీఎంను కలిసి కేసు గురించి వివరించి వచ్చారు. కోర్టు శిక్ష విధించిన కేసు వ్యక్తిగతమైనదే కాక, చాలా పాతదని కిరణ్ దృష్టికి రాజగోపాల్ తీసుకెళ్లారు. ఇందులో సారథి ఉద్దేశపూర్వకంగా చేసిన నేరమేమీ లేదని రాజగోపాల్ చెబుతున్నారు. గత రెండురోజులుగా కోర్టు పరిణామాలతో తలమునకలై ఉన్న సారథి శుక్రవారం కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు. ఢిల్లీ నుంచి రాజీనామాకు ఒత్తిడి లేకపోవడంతో ప్రస్తుతానికి ఈ వ్యవహారానికి తాత్కాలిక విరామం లభించినట్టేనని అంటున్నారు.
మంత్రి పార్థసారథి శుక్రవారం ఇందిరమ్మ బాటలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి వెంటే ఉన్నారు. రాజకీయ పరిణామాలు చకచకా మారుతున్న తరుణంలో ఆయన విశాఖపట్నం విమానాశ్రయంలో ముఖ్యమంత్రి వెంట కనిపించారు. శ్రీకాకుళం జిల్లాలో ఇందిరమ్మ బాట కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం కిరణ్ విశాఖపట్నానికి రాగా ఆయనతోనే సారథి కూడా ఉన్నారు.
రాజీనామాపై విలేకరులు ప్రశ్నించగా.. ముఖ్యమంత్రి ఉండగా తాను ఆ విషయం మాట్లాడటం బాగుండదని పార్థసారథి అన్నారు. సీఎం కిరణ్ అసలు మీడియాకు ముఖం చూపించకుండా ఎయిర్పోర్టు లోపలి నుంచే హెలికాప్టర్ ఎక్కి శ్రీకాకుళం వెళ్లిపోయారు. ఆయనతో పాటు మంత్రి గంటా శ్రీనివాసరావు వెళ్లగా, మంత్రులు పితాని సత్యనారాయణ, పార్థసారథి, మాణిక్యవరప్రసాద్ రోడ్డుమార్గాన శ్రీకాకుళం వెళ్లారు.












Click it and Unblock the Notifications