రైలు ప్రమాదం: విద్రోహచర్య కావచ్చునని రైల్వే మంత్రి
నెల్లూరు: తమిళనాడు ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదానికి విద్రోహ చర్య కారణమై ఉండవచ్చునని రైల్వే మంత్రి ముకుల్ రాయ్ అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే, ఈ దశలో ఏమీ చెప్పలేమని ఆయన కోల్కత్తాలో మీడియా ప్రతినిధులతో అన్నారు. ఈ దశలో దేన్నీ తోసిపుచ్చలేమని ఆయన అన్నారు. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు శబ్దం వినిపించిందని గాయపడిన కొంత మంది ప్రయాణికులు, గేట్మన్ చెప్పినట్లు ఆయన తెలిపారు.
బోగీలో ఏమైనా పేలుడు పదార్థాలున్నాయా, షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదం జరిగిందా అనే విషయంపై దర్యాప్తు జరుగుతోందని ఆయన చెప్పారు. ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. కాగా, బోగీలో రసాయన పదార్థాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుల్లో ఆరుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. నిజానికి, అధికారులు ప్రమాదం జరిగిన 12 గంటల వరకు నలుగురి మృతదేహాలను మాత్రమే గుర్తించారు. మృతదేహాలు ఆనవాళ్లు లేకుండా కాలిపోవడంతో వారిపై ఉన్న వస్తువులను బట్టి గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
రైల్వే అధికారులు 28 మంది క్షతగాత్రుల వివరాలు మాత్రమే చెప్పగలుగుతున్నారు. మంటల్లో కాలిపోయిన ఎస్ -11 బోగీలో మొత్తం 72 మంది ప్రయాణికులున్నారు. ఇప్పటి వరకు 32 మంది మృతదేహాలను వెలికి తీశారు. ఫోరెన్సిక్ నిపుణలు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఎవరూ పెదవి విప్పడం లేదు. రాష్ట్రానికి చెందిన ప్రయాణికుల వివరాలు కూడా తెలియడం లేదు.
అయితే, ఇది విద్రోహ చర్య కాదని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) దినేష్ రెడ్డి సోమవారం విశాఖపట్నంలో అన్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదం జరిగిందని ప్రాథమిక తేలిందని ఆయన అన్నారు. అయితే, తాము కూడా దర్యాప్తు చేపట్టామని ఆయన చెప్పారు. ప్రమాదంపై పూర్తి నివేదికను త్వరలో వెల్లడిస్తామని ఆయన చెప్పారు. కుట్రో, ప్రమాదమో తేల్చాలని సంఘటనా స్థలాన్ని సందర్సించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.