తప్పని తేలితే చర్యలు: మంత్రి పార్థసారథిపై భన్వర్ లాల్
అఫిడవిట్లో తప్పులున్నా, పూర్తి వివరాలు లేకున్నా అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై భన్వర్ లాల్ అనంతపురం జిల్లా కలెక్టర్, తహశీల్దార్తో సమీక్షా సమావేశం నిర్వహించారు. కళాశాలల్లో ఓటర్ల నమోదుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆగస్టు చివరికల్లా ఆ ప్రక్రియ పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.
కాగా మంత్రి పార్థసారథి ఎన్నికల కమిషన్ వద్ద తన పైన కేసు ఉన్న విషయాన్ని దాచి పెట్టారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. 2009 ఎన్నికలలో పార్థసారథి కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై అతి స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్కు సమర్పించిన తన అఫిడవిట్లో పార్థసారథి తనపై కేసులు లేవని పేర్కొన్నారు. అఫిడవిట్ సమర్పించినప్పుడు కేసులు ఉంటే తప్పకుండా పేర్కొనవలసి ఉంది. కానీ పార్థసారథి మాత్రం ఈ విషయాన్ని పేర్కోలేదు.
ఇటీవల ఫెరా కేసులో నేరస్తుడిగా రుజువైన నేపథ్యంలో ఎన్నికల అఫిడవిట్లో కేసు విషయమై ప్రస్తావించక పోవడం ద్వారా ఆయన మరిన్ని చిక్కుల్లో పడ్డారని అంటున్నారు. ప్రజాప్రాతినిథ్యం చట్టం 1951 ప్రకారం ఆయనపై అనర్హత వేటుకు అవకాశముందని అంటున్నారు. ఈ చట్టం ప్రకారం నిబంధనలు ఉల్లంఘించినట్లు రుజువైతే ఆయన ఆరేళ్ల పాటు ఎన్నికలలో పోటీ చేసేందుకు అనర్హుడవుతాడని చెబుతున్నారు.