టిడిపిని వీడను, చిరంజీవిలాగే జగన్ కూడా: ఎర్రబెల్లి
త్వరలో తెలంగాణపై గతంలో టిడిపి ఇచ్చిన లేఖ కంటే మరింత స్పష్టంగా మరో లేఖను కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వనున్నట్లు తెలిపారు. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారని చెప్పారు. త్వరలో కెసిఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితి కనుమరుగు కావడం ఖాయమన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ లభించాక ఆయన తన పార్టీని చిరంజీవిలాగే కాంగ్రెసులో విలీనం చేయడం ఖాయమన్నారు.
కాగా ఇటీవల చంద్రబాబుతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు భేటీ అయిన విషయం తెలిసిందే. భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. బాబు తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖ రాసేందుకు అనుకూలంగా ఉన్నారని చెప్పారు. తమ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పారు.
మరోవైపు గోదావరి జలాలతో ములుగు నియోజకవర్గ ప్రజల దాహార్తి తీర్చాలని ములుగు శాసనసభ్యురాలు సీతక్క ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కోరారు. బుధవారం సచివాలయంలో సిఎంను కలిసిన సీతక్క నియోజకవర్గ సమస్యలను ఐదు వినతిపత్రాలుగా సమర్పించారు.