ప్రధాని పదవిపై అద్వానీ సంచలనం, మోడీకి నితీష్ నో

కేంద్రంలో కాంగ్రెసు, బిజెపియేతర వ్యక్తి నేతృత్వంలో తదుపరి ప్రభుత్వం ఏర్పడినా ఈ రెండు పార్టీలలో ఏదో ఒక పక్షం మద్దతు తప్పనిసరి అన్నారు. అయితే ఆ ప్రభుత్వం ఎక్కువ కాలం అధికారంలో మనజాలదన్నారు. అద్వానీ తాజాగా తన బ్లాగ్లో జాతీయ రాజకీయ భవిష్యత్ చిత్ర పటాన్ని ఆవిష్కరించారు. మరోవైపు ప్రధానమంత్రి రేసులో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ లేనిపక్షంలోనే 2014 సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ ఎన్డీయేకు మద్దతు ఇస్తుందని జేడీయూ అధ్యక్షుడు, బీహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్.. బిజెపి అధ్యక్షుడు నితిన్ గడ్కరీకి తేల్చి చెప్పారు.
అయితే ఎన్డీయే కూటమిలో ముసురుకుంటున్న ప్రధానమంత్రి వివాదం ఎటు దారి తీస్తుందోనననే ఆసక్తి రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. ఎన్టీయే తరఫున నరేంద్ర మోడీ పేరును ప్రధానమంత్రి పదవికి ప్రతిపాదించబోమని హామీ ఇవ్వాలని బిజెపిని జెడియూ గట్టిగా కోరింది. ఆ షరతుపై మాత్రమే తాము 2014 ఎన్నికల్లో బిజెపితో కలిసి పని చేయగలమని బీహార్ సిఎం నితీశ్ కుమార్ స్పష్టం చేశారు.
ఈ విషయాన్ని ఆయన స్వయంగా గడ్కరీకి చెప్పినట్టు నితీశ్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ కథనం ప్రకారం, ఇటీవల రాష్ట్రపతి పదవీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో వారిద్దరు కలుసుకొన్నారు. ఈ సమయంలో నితీశ్ కుమార్ ప్రధానమంత్రి అభ్యర్థిత్వం గురించి ప్రస్తావించారు. ఇంకా సంవత్సరన్నర కాలం ఉన్నందున, తమ పార్టీలో అటువంటి చర్చ ఏదీ జరగడం లేదని నితిన్ ఆయనకు వివరించారు. అయితే, ప్రధానమంత్రి అభ్యర్థిత్వంపై ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెడితే బాగుంటుందని నితీశ్ సూచించారు. ఐతే, ఆ అభ్యర్థి మోడీ కాకూడదని గట్టి షరతు విధించారు.
అద్వానీ బ్లాగ్ వ్యాఖ్యల ద్వారా.. బలమైన నేతగా ఎదిగినా.. ప్రధానమంత్రి పదవికి పోటీపడటం, పీఠం దక్కించుకోవడం మోడీకి ఇప్పట్లో సాధ్యం కాదనే సంకేతాలను అద్వానీ పరోక్షంగానైనా ఇచ్చినట్టయింది.












Click it and Unblock the Notifications