ధర్మాన ప్రాసిక్యూషన్కు ముఖ్యమంత్రి నో పర్మిషన్
వాన్పిక్ భూకేటాయింపులు, ఒప్పందంలో ధర్మానతోపాటు అధికారుల తప్పేమీ లేదన్న అభిప్రాయంతో ముఖ్యమంత్రి ఉన్నారు. దీంతో ప్రాసిక్యూషన్కు కూడా అనుమతి ఇవ్వరాదనే నిర్ణయంతోనే సీఎం ఉన్నట్లు ఆయనతో సమావేశమైన మంత్రులు చెబుతున్నారు. కాగా, ధర్మాన రాజీనామాను ఆమోదించకూడదని, ప్రాసిక్యూషన్కు అనుమతించకూడదని మంత్రులు ముఖ్యమంత్రిని కోరుతున్నారు.
మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మాన ప్రసాదరావుకు మంత్రివర్గ సహచరులు అండగా నిలిచారు. గురువారం నాడు ఆయన నివాసంలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, మంత్రులు బాలరాజు, కాసు వెంకట కృష్ణారెడ్డి, తోట నరసింహం, కె.పార్థసారథి, కోండ్రు మురళీమోహన్, ఎంపీ కిల్లి కృపారాణి తదితరులు కలిశారు. వారు ధర్మానకు మద్దతు పలికారు. ఇదే విషయమై పార్లమెంటు సభ్యురాలు కిల్లి కృపారాణి సీఎం కిరణ్తో కూడా మాట్లాడారు.
ఆ సందర్భంలో, "మీరు ఎంపీ కాబట్టి.. ఈ విషయమై అధిష్ఠానాన్ని కలిస్తే మేలు'' అని సీఎం ఆమెకు సూచించినట్లు తెలిసింది. వాన్పిక్ భూముల కేటాయింపులో ధర్మాన ప్రసాదరావు తప్పు చేయలేదని రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి పునరుద్ఘాటించారు. తప్పుచేయనప్పుడు ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, రాజీనామాను ఆమోదించాల్సిన అవసరం లేదని చెప్పారు.
కేబినెట్ తీసుకున్న సమష్టి నిర్ణయాలపై మంత్రులను ప్రశ్నించే హక్కు దర్యాప్తు సంస్థలకు ఎంతవరకు ఉందని పర్యాటక శాఖ మంత్రి వట్టి వసంత్కుమార్ అన్నారు. కేబినెట్ నిర్ణయం తీసుకున్న అంశాలకు ఒక మంత్రిని బాధ్యుడిని చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ధర్మాన ప్రసాదరావు నిష్కళంకితుడని మంత్రి కోండ్రు మురళీమోహన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
సీబీఐ తప్పుడు అభిప్రాయంతో ధర్మానపై అభియోగం మోపిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసేందుకు సీబీఐ అత్యుత్సాహం చూపుతోందని.. అందులో భాగంగానే ధర్మాన ప్రసాదరావుపై అభియోగాలను మోపిందని మాజీమంత్రి టి.జీవన్రెడ్డి ఆరోపించారు. సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన 26 జీవోలతో సహా సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న అంశాలన్నీ కేబినెట్ సమష్టి నిర్ణయాలుగా పేర్కొన్నారు.