పోక్సో కేసులో ఊహించని ట్విస్ట్! ఓ విలక్షణ కేసులో సుప్రీం తీర్పు
బాలలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం (POCSO) కింద నమోదైన ఒక కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కింది కోర్టులు నిందితుడికి విధించిన జైలు శిక్షను, నేర నిర్ధారణను పూర్తిగా రద్దు చేసింది. బాధితురాలు మేజర్ అయిన తర్వాత వారిద్దరూ వివాహం చేసుకోవడం, ఆమె భవిష్యత్తు భద్రత కోసం నిందితుడు రూ. 10 లక్షల పరిహారం చెల్లించడాన్ని అత్యున్నత న్యాయస్థానం ప్రత్యేక పరిస్థితిగా పరిగణించింది.
జస్టిస్ జెకె మహేశ్వరి, జస్టిస్ అతుల్ ఎస్. చందూర్కర్లతో కూడిన ధర్మాసనం రాజ్యాంగంలోని అధికరణం 142 ప్రకారం తమకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించి ఈ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, ఈ కేసులోని ప్రత్యేక పరిస్థితుల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని, దీనిని భవిష్యత్తులో ఇతర కేసులకు ఉదాహరణగా (Precedent) చూపించకూడదని కోర్టు స్పష్టం చేసింది.

10 ఏళ్ల జైలు శిక్ష.. నాలుగేళ్ల పోరాటం
ఈ కేసు నేపథ్యం పరిశీలిస్తే.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ బాధితురాలు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన ట్రయల్ కోర్టు 2019లో నిందితుడికి పోక్సో చట్టం కింద 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. దీనిపై నిందితుడు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు అతని జైలు శిక్షను తాత్కాలికంగా నిలిపివేసింది.
ఆ తర్వాత కాలంలో వీరిద్దరూ కలిసి జీవించడం ప్రారంభించారు. తాము గత నాలుగేళ్లుగా కలిసే ఉంటున్నామని, ఈ వివాదానికి ముగింపు పలకాలని కోరుకుంటూ బాధితురాలే స్వయంగా హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. నిందితుడిపై ఉన్న నేర నిర్ధారణను రద్దు చేయాలని కోరింది. కానీ, చట్ట నిబంధనల ప్రకారం 2021లో హైకోర్టు ఆమె పిటిషన్ను తోసిపుచ్చింది.
మలుపులు తిరిగిన కథ.. చివరకు పెళ్లి
హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నిందితుడు సుప్రీంకోర్టు తలుపు తట్టాడు. ఈ క్రమంలో బాధితురాలి వాంగ్మూలాన్ని కోర్టు పలుమార్లు పరిశీలించింది. మొదట్లో నిందితుడు తనను నిరాకరించడంతో ఆమె వేరే వ్యక్తిని వివాహం చేసుకుంది. కానీ, నిందితుడితో ఉన్న పాత సంబంధం గురించి తెలిసి ఆ వ్యక్తి ఆమెను వదిలేశాడు. దీంతో ఆమె తండ్రి వద్దే ఉంటోంది. ఈ పరిస్థితుల్లో 2024లో నిందితుడి కుటుంబ సభ్యులు బాధితురాలిని సంప్రదించి, వారిద్దరికీ అధికారికంగా వివాహం జరిపించారు.
రూ. 10 లక్షల పరిహారం.. సుఖంతమైన వివాదం
ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన విచారణలో బాధితురాలు కోర్టుకు ఒక కీలక విషయం తెలిపింది. తన జీవిత భద్రత కోసం నిందితుడి నుంచి రూ.10 లక్షల పరిహారం అందితే, ఇకపై ఎలాంటి న్యాయపోరాటం చేయకుండా ప్రశాంతంగా బతుకుతానని పేర్కొంది. కోర్టు ఆదేశాల మేరకు నిందితుడు ఆ మొత్తాన్ని చెల్లించాడు. దీనికి సంబంధించిన రికార్డులను రిజిస్ట్రార్ ముందు నమోదు చేశారు.
బాధితురాలికి పరిహారం అందడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్రత్యేక నిర్ణయానికి అభ్యంతరం చెప్పకపోవడంతో సుప్రీంకోర్టు నిందితుడిని నిర్దోషిగా విడుదల చేసింది. "తదుపరి జరిగిన పరిణామాల ఆధారంగా శిక్షను రద్దు చేస్తున్నాం. అప్పీలుదారు (నిందితుడు), బాధితురాలు భార్యాభర్తలుగా సమాజంలో ప్రశాంతంగా జీవించడానికి స్వేచ్ఛగా వదిలివేస్తున్నాం" అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.














Click it and Unblock the Notifications