సిబిఐ వేధిస్తోంది, వారిని అరెస్టు చేయలేదు: నిమ్మగడ్డ

జగన్ అక్రమాస్తుల కేసులో ఇప్పటికే చార్జిషీట్ దాఖలైనందున తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సిబిఐ ఇటీవలే దాఖలు చేసిన నాలుగో చార్జిషీట్లోని నిందితులను ఇప్పటికీ అరెస్టు చేయనందున సమానత్వం ప్రాతిపదికన బెయిల్ పొందడానికి తాను అర్హుడినని నిమ్మగడ్డ తన పిటిషన్లో పేర్కొన్నారు. జగతిలో పెట్టుబడులు పెట్టిన మిగతావారిని అరెస్టు చేయకుండా తనని మాత్రమే సిబిఐ వేధిస్తోందని, కోర్టుకు నిజాలు చెప్పకుండా తొక్కిపెడుతోందని ఆరోపించారు.
దర్యాప్తు నిమిత్తం సిబిఐ ఎన్నిసార్లు పిలిచినా హాజరయ్యానని, వారడిగిన ప్రశ్నలకు బదులిచ్చానని, ఆ నిజాలను తొక్కిపెట్టి, పసలేని కారణాలను చూపుతూ అక్రమంగా అరెస్టు చేసి నన్ను బలిపశువును చేసిందని అన్నారు. అవాస్తవాలతో కోర్టును పక్కదారి పట్టిస్తోందని, వాన్పిక్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా వెచ్చించలేదని, అలాగే నష్టపోనూ లేదని, తాను ప్రభుత్వాధికారిని కాకున్నా పిసి యాక్ట్ కింద, ఐపిసి 409 సెక్షన్ కిందా కేసులు పెట్టి సిబిఐ వేధిస్తోందన్నారు.
దర్యాప్తు సాగుతున్నందున బెయిల్ ఇవ్వలేమని గతంలో కోర్టు పేర్కొందని, ఇప్పుడు సిబిఐ చార్జిషీటు దాఖలు చేసినందున తాను సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం లేదని, వీటన్నింటిని గమనంలోకి తీసుకుని బెయిల్ ఇవ్వాలని కోర్టుకు నిమ్మగడ్డ మొరపెట్టుకున్నారు. చార్జిషీట్ దాని అనుబంధ పత్రాలన్నీ కలిపి 30వేల వరకు ఉంటాయని, వాటిని పరిశీలించి విచారణ పూర్తికావడానికి చాలా కాలం పడుతుందని కోర్టు దృష్టికి తెచ్చారు. పిటిషన్ను స్వీకరించిన కోర్టు.. సిబిఐని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేసును శుక్రవారానికి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications