గీతిక ఆత్మహత్య: కందాకు హైకోర్టులో చుక్కెదురు
పోలీసులు అరెస్టు చేస్తారనే భావన కూడా లేకుండా ఎక్కడో హాయిగా నిందితుడు కూర్చున్నట్లు అనిపిస్తోందని జస్టిస్ పికె భాషిన్ వ్యాఖ్యానించారు. సరైన అధికారితను తీసుకోకుండా కందా సోదరుడు గోవింద్ కుమార్ ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ను దాఖలు చేశారని అన్నారు. పిటిషన్ మెరిట్లోకి వెళ్లడం లేదని, అరెస్టవుతానని అనుకుంటున్న వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేయలేదనే కారణంతోనే తోసిపుచ్చుతున్నామని చెప్పారు.
పిటిషన్ను తోసిపుచ్చడానికి కోర్టు పలు సాంకేతిక కారణాలను చూపించింది. నిందితుడు స్వయంగా వకాలత్నామా గానీ అఫిడవిట్స్ గానీ దాఖలు చేయలేదని, పత్రాలు అందజేసిన వ్యక్తికి అధికారితను కట్టబెట్టలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. కందా బెయిల్ పిటిషన్ను కింది కోర్టు ఇది వరకే తోసిపుచ్చింది.
గీతికా శర్మ ఆత్మహత్య కేసులో కందా పరారీలో ఉన్న విషయం తెలిసిందే. ఎయిర్ హోస్టెస్ గీతికా శర్మ ఆత్మహత్య కేసులో హర్యానా మాజీ మంత్రి గోపాల్ గోయల్ కందాకు ఢిల్లీ కోర్టు గురువారం నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. గీతికను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కందాపై ఆరోపణలున్న విషయం తెలిసిందే. తనపై కేసు పెట్టినప్పటి నుంచి కందా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. ఈ కేసులో అరుణా చద్దాను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.