ఎమ్మెల్యే శ్రీరాములుకు నోటీసులు, గాలి కేసు వాయిదా
గాలి బెయిల్ డీల్ వ్యవహారం కేసులో అరెస్టయిన శానససభ్యుడు సురేష్ బాబు వెల్లడించిన అంశాల ఆధారంగా శ్రీరాములుపై ఎసిబి కొన్ని ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. రావి సూర్యప్రకాశ్ బాబుతో వ్యవహారం నడిపించింది శ్రీరాములేనని ఎసిబి అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో గాలి బెయిల్ స్కామ్ కేసులో శ్రీరాములు పాత్రను నిర్ధారించుకుని, తదుపరి చర్యలు చేపట్టేందుకు ఎసిబి ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. శ్రీరాములు గాలి జనార్దన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడనే విషయం తెలిసిందే.
గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ స్కామ్ కేసులో ఎసిబి ఇప్పటికే 11 మందిని అరెస్టు చేసింది. వీరిలో 8 మందిపై చార్జిషీట్ కూడా దాఖలు చేసింది. కాగా, ఈ కేసులో సస్పెండయిన న్యాయమూర్తి పట్టాభి రామారావుకు కోర్టు గురువారం బెయిల్ నిరాకరించింది. ప్రస్తుతం గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటక రాజధాని బెంగళూర్ జైలులో ఉన్నారు.
ఇదిలావుంటే, గనుల సరిహద్దుల చెరిపివేత, తపాలా గణేష్పై దాడి కేసులను సండూరు కోర్టు నవంబర్ 28వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న గాలి జనార్దన్ రెడ్డిని పోలీసులు శుక్రవారం సండూరు కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ నిమిత్తం కేసును నవంబర్ 28వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. దీంతో గాలి జనార్దన్ రెడ్డిని పోలీసులు బెంగళూర్ జైలుకు తరలించారు. కేసు విచారణ సమయంలో కోర్టుకు వచ్చిన ఇద్దరు పార్లమెంటు సభ్యులను, ఓ శాసనసభ్యుడిని పోలీసులు లోనికి అనుమతించలేదు.