తెలంగాణ: సీమాంధ్ర నేతలను సిద్ధం చేస్తున్న బాబు
తెలంగాణ అంశంపై సీమాంధ్ర నేతలు, పార్టీకి అండగావున్న సామాజిక వర్గ నేతలతో చంద్రబాబు విడివిడిగా ముఖాముఖి చర్చించారు. తెలంగాణకు తెలుగుదేశం పార్టీయే అడ్డంకి అనే భావన తెలంగాణ ప్రజల్లో బలంగా ఏర్పడిందని, తెలంగాణలో పార్టీకి ఎంతో బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ, ఈ ప్రచారం వల్ల పార్టీకి తీరని నష్టం కలిగిందని ఆయన చెప్పినట్లు సమాచారం. సీమాంధ్రలో, తెలంగాణలో పార్టీ పరిస్థితిని నేతలకు చంద్రబాబు వివరించారు.
‘పార్టీ బతికి బట్టకట్టాలంటే తెలంగాణపై నిర్ణయం తీసుకోక తప్పదు. తెలంగాణకు అనుకూలంగా గతంలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి లేఖ రాయాలనే నిర్ణయానికి వచ్చాను. పార్టీ కోసం ఇది చేస్తున్నా, తరువాత మీ ఇష్టం' అని సీమాంధ్ర నేతలకు బాబు స్పష్టం చేసినట్టు సమాచారం. ‘తెలంగాణ, బీసీ డిక్లరేషన్, ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకొని జనంలోకి వెళ్తాను. వాటి ప్రభావం తప్పకుండా ఉంటుంది' అని వివరించినట్టు సమాచారం.
ఈ పరిస్థితుల్లో సెప్టెంబర్ మొదటి వారంలోనే ఒక ప్రకటన చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. చంద్రబాబు ఈ నిర్ణయానికి వచ్చిన తరువాతే బైరెడ్డి రాజశేఖర్రెడ్డి రాయలసీమ పేరుతో రాజకీయం మొదలు పెట్టారని పార్టీ నేతలు అంటున్నారు. బాబు తెలంగాణకు లేఖ ఇస్తే సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తామని టిడిపి ఎంపి మోదుగుల వేణుగోపాల్రెడ్డి ప్రకటనను ప్రస్తావిస్తూ, ఆయా ప్రాంతాల ప్రజలను సంతృప్తి పరచడానికి నాయకులు కొన్ని ప్రకటనలు చేసినా, పార్టీలో ఉండదలుచుకున్న వారంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని పార్టీ నేతలు అంటున్నారు.
తెలంగాణ, ఎస్సీ వర్గీకరణ, బీసీ డిక్లరేషన్ వంటి కీలక అంశాల ద్వారా ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో పార్టీకి మేలు జరుగుతుందని భావిస్తున్నారు. వాతావరణం చూస్తే కేంద్రం తెలంగాణపై నిర్ణయం తీసుకునేట్టుగా కనిపించడం లేదని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. తాము నిర్ణయం ప్రకటించిన తరువాత తెలంగాణ ఏర్పాటు చేస్తే అది తమ వల్లనేనని చెప్పుకునే అవకాశాలుంటాయని భావిస్తున్నారు. ఏర్పాటు చేయకపోతే తాము లేఖ ఇచ్చినా తెలంగాణ ఏర్పాటు చేయలేదని, కాంగ్రెస్, టిఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయని ప్రచారం చేయవచ్చునని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు.
తెలంగాణ ఏర్పడే అవకాశాలు లేవనే భావనతోనే పార్టీ నాయకత్వం ఉందని సీనియర్ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్ బాగా బలహీనపడింది, తెలంగాణలో టిఆర్ఎస్ బలహీనపడుతోంది, ఆ మేరకు వైయస్సార్ కాంగ్రెస్ బలపడితే ఎన్నికల తరువాత ఆ పార్టీ ఎలాగూ యూపీఏకే మద్దతిస్తుంది. కాబట్టి తెలంగాణ ఇవ్వకపోయినా వచ్చే నష్టమేమీ లేదనే ఆలోచనలో కాంగ్రెస్ ఉందని, అందుకే తెలంగాణపై తేల్చడం లేదని టిడిపి సీనియర్ నాయకులు చెబుతున్నారు.
వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొనే తెలంగాణకు అనుకూలంగా స్పష్టమైన వైఖరి ప్రకటించి జనంలోకి వెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారని పార్టీ నేతలు అంటున్నారు. తెలంగాణపై ప్రకటన తరువాత తెలంగాణ, బీసీ డిక్లరేషన్, ఎస్సీ వర్గీకరణ అంశాలను ప్రధాన అజెండాగా తీసుకుని జనంలోకి వెళ్లనున్నట్టు బాబు పార్టీ వారికి తెలిపారు.