బాలయ్య పదవిపై సస్పెన్స్: బాబు దారిలో పార్టీపై ఫోకస్
ఇప్పటికే డిక్లరేషన్తో బాబు పార్టీలో నూతనోత్తేజం నింపగా.. తాజాగా బాలకృష్ణ కూడా బిసిలపై ఫోకస్ చేశారని అంటున్నారు. వారిని ఆకర్షించేందుకు బాలయ్య ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారట. ఇప్పటికే తాను ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉన్నానని ప్రకటించిన బాబు రాష్ట్రంలో బిసిలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని అంటున్నారు. ఇప్పటి వరకు బహిర్గతంగా బాలయ్య రాజకీయ సమావేశాలు, చర్చలు జరపనప్పటికీ లోలోన పలువురితో ఆయన భేటీ అవుతున్నారని తెలుస్తోంది.
ఆయా జిల్లాల నేతలతో భేటీ అయి ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో బిసిలు ఎక్కువగా ఉన్నారు, ఉన్న బిసిలలో ఏ కులం వారు ఎక్కువగా ఉన్నారు తదితర అంశాలపై స్థానిక నేతల నుండి ఆరా తీస్తున్నారట. ఆయా జిల్లాలలో పార్టీలో బిసిలకు ఏఏ పదవులు కట్టబెట్టారనే విషయాలను వాకబు చేస్తున్నారట. ఇటీవల రెండుమూడుసార్లు బాబును కూడా కలిశారు. వారి మధ్య కూడా బిసి డిక్లరేషన్ అంశం చర్చకు వచ్చిందని తెలుస్తోంది. నిన్న బాబు డిక్లరేషన్... తాజాగా బాలయ్య బిసిలపై కాన్సట్రేషన్ చేస్తుండటంతో ఆ వర్గాలు మళ్లీ టిడిపి వైపు భారీగా మొగ్గే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
మరోవైపు బాలకృష్ణ తన ఫ్యాన్స్ను పార్టీకి అటాచ్ చేసే విధంగా వ్యూహరచన చేస్తున్నారని తెలుస్తోంది. నందమూరి అభిమానులలో ఎక్కువగా బిసిలు ఉన్నారు. దీంతో బాలయ్య బిసిలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారని అంటున్నారు. బాలయ్య త్వరలో రాష్ట్రంలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. అయితే బాలయ్య ఏ పదవితో ప్రజల్లోకి వెళ్లాలనే అంశంపై సస్పెన్స్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉందని సమాచారం. పార్టీ ప్రధాన కార్యదర్శిగా వెళ్లాలా లేక వర్కింగ్ ప్రెసిడెంట్గా వెళ్లాలా అనే అంశంపై తర్జన భర్జనలు జరుగుతున్నాయని అంటున్నారు.